
శనివారం రోజున శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనది. ఈ రోజున పూజ చేసేవారు, ఉపవాసం ఉండేవారు కొన్ని నియమాలను పాటించడం ద్వారా రెట్టింపు ఫలితాలను పొందవచ్చని, స్వామి ఆశీస్సులు కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయని శాస్త్రం చెబుతోంది. కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందడానికి ఆచరించాల్సిన పద్ధతులు, పాటించకూడని నియమాలు ఈ వ్యాసంలో వివరించబడ్డాయి.
శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, దేవుడి గదిని శుభ్రపరిచి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించాలి. పూజకు సిద్ధమయ్యేటప్పుడు తులసి ఆకులు, ముద్ద కర్పూరం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి కర్పూరం, తులసి ఆకులంటే ఎంతో ఇష్టం. ఇవి లేని పూజకు పుణ్యఫలం లభించదని చెప్పబడింది. వెంకటేశ్వర స్వామికి బియ్యప్పిండితో తయారుచేసిన దీపంలో దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. బియ్యప్పిండిలో పాలు కలిపి ముద్దలా చేసి ప్రమిదలా తయారుచేసి, దానిపై కుంకుమతో మూడు బొట్లు పెట్టి, ఏడు వత్తులు వేసి నూనె పోసి దీపం వెలిగించాలి. ఇలా ఐదు శనివారాలు పూజ చేస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు.
పూజ చేసేటప్పుడు “ఓం గోవిందాయ నమః” అనే మంత్రాన్ని జపించడం వల్ల ఏడుకొండల స్వామి అనుగ్రహం లభిస్తుంది. పూజానంతరం మీ కోరికను దేవుని ముందు కోరుకుని గంట కొట్టడం వల్ల కోరికలు నేరుగా భగవంతుడికి చేరుతాయి. శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది. ఇంట్లో పూజ చేసిన తర్వాత సాంబ్రాణి పొగ వేయడం వల్ల ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. బిర్యానీ ఆకుపై మీ కోరిక రాసి కాల్చి, దాని బూడిదను మొక్కలకు వేయడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ పరిహారం చాలా శక్తివంతమైనదని చెప్పబడింది. చామంతి, గులాబీ, గన్నేరు పూలతో పూజ చేయడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.
రోజు పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజున ఇంట్లో దీపం వెలిగిస్తే సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఒక గాజు గిన్నెలో నీరు పోసి కర్పూరం వేసి దేవుని పటాల ముందు ఉంచడం, ఆ నీటిని వారానికి ఒకసారి మార్చడం వల్ల ఇంట్లోని చెడు శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పిల్లల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఉన్నవారు పసుపు వస్త్రంలో కర్పూరాన్ని మూటకట్టి పూజ గదిలో పెట్టి పూజ చేస్తే మంచిది. కష్టమైన సమస్యల నుండి బయటపడటానికి శనివారం సాయంత్రం కొబ్బరికాయపై కుంకుమ బొట్టు పెట్టి పూజ చేసి కొట్టాలి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు 11 ప్రదక్షిణాలు చేయడం శ్రేయస్కరం.
శనివారం నాడు కొన్ని ఆహార పదార్థాలను తినడం లేదా కొనుగోలు చేయడం నిషిద్ధం. బెండకాయ, మిరపకాయలు, మామిడికాయ పచ్చడి, కందిపప్పును శనివారం తినకూడదు. కందిపప్పు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, కొనుగోలు చేయడం వల్ల శని ప్రభావం ఉగ్రరూపం దాల్చి సమస్యలు ఎదురవుతాయని చెప్పబడింది. అలాగే శనివారం నువ్వులు, మినప్పప్పు, చీపురు, నూనె, ఉప్పు, బట్టలు కొనుగోలు చేయకూడదు. ఈ వస్తువులు కొనుగోలు చేస్తే అష్ట కష్టాలు తలెత్తుతాయని, అనారోగ్య సమస్యలు వస్తాయని, అప్పుల పాలయ్యే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. వేరే వారి ఇంటి నుండి ఉప్పు తీసుకోవడం కూడా మంచిది కాదు.
పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు ఉంచాలి. పూజలోని దైవశక్తి ఈ నీటిలో నిక్షిప్తమై ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి. మిగిలిన నీటిని మొక్కలకు పోయాలి. పూజ సమయంలో దీపం కొండెక్కితే అపశకునంగా భావించి, దేవతలు అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు. అలాంటప్పుడు భగవంతుడికి క్షమాపణ చెప్పి “ఓం నమశ్శివాయ” అని మూడుసార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి. ఈ నియమాలను పాటించడం వల్ల శుభ ఫలితాలు, వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)