తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం..పెరిగిపోతున్న కేసులు
ఢిల్లీ వేదికగా జరిగిన తబ్లీగ్ జమాత్ ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. కరోనా రెండో దశదాటి సామూహిక వ్యాప్తి దిశగా సాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలపైనా కరోనా రక్కసి పంజా
భారత్లో కరోనా కరాళానృత్యం చేస్తోంది. వైరస్ మహమ్మారి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఢిల్లీ వేదికగా జరిగిన తబ్లీగ్ జమాత్ ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. కరోనా రెండో దశదాటి సామూహిక వ్యాప్తి దిశగా సాగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలపైనా కరోనా రక్కసి పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ఏపీలో గత రాత్రి నుంచి నేటి ఉదయం 10 గంటల వరకు కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి పెరిగింది. తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కృష్ణా జిల్లాకు చెందినవారు నలుగురు, కడప జిల్లాకు చెందినవారు నలుగురు, గుంటూరు జిల్లాకు చెందినవారు ముగ్గురు, కర్నూల్ జిల్లాకు చెందినవారు ముగ్గురు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 180 కేసులలో నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 , అనంతపురం జిల్లాలో అతితక్కువగా 2 కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు తప్పించుకున్నాయి.
ఇటు, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 229కి చేరింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ మర్కాజ్ ప్రార్థనలకు వెళ్లిన వారి వల్లే కరోనా కేసుల సంఖ్య పెరిగిందంటున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 11కి చేరింది. శుక్రవారమే కరోనా వల్ల ఇద్దరు చనిపోయారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, సికింద్రాబాద్ గాంధీలో ఒక్కరు చొప్పున మరణించారు.
హైదరాబాద్ నగర పరిధిలోనే ఎక్కువగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఏప్రిల్ 2 వరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్యను పరిశీలిస్తే.. దాదాపు 50 శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. హైదరాబాద్ , రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 76 కేసులు గుర్తించారు. ఆ తర్వాత అత్యధిక కేసులు వరంగల్ అర్బన్, కరీంనగర్ జిల్లాల్లో నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గానూ ఇప్పటి వరకూ 20 జిల్లాల్లో కరోనా వైరస్ బాధితులున్నట్లు నిర్ధారణ అయ్యింది.