గత కొద్దికాలంగా.. చాపకింద నీరులా.. భారతీయ జనతా పార్టీ ‘ఆకర్ష్’ చేపట్టింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ నుంచి చాలా మంది బడానేతలు ఆ పార్టీలో చేరారు. బీజేపీ ఇచ్చే ఆఫర్లతో.. చాలా మంది నేతలు కాషాయం కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కమలం గూటికి చేరనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన దేవయ్య ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. సుద్దాల దేవయ్య ఇప్పటికే బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని.. రెండు మూడు రోజుల్లోనే బీజేపీలో చేరే అవకాశాలున్నాయని సమాచారం.
శనివారం హైదరాబాద్లో బీజేపీ సమావేశం ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ను హైదరాబాదులో కలవనున్నారు. అయితే.. ఈరోజే సుద్దాల దేవయ్య పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు కూడా వినిపిస్తోన్నాయి. అలాగే.. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పలువురు ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని సమాచారం.