
దాహం వేయడం లేదని నీరు తాగకపోతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా చలికి వేడివేడిగా ప్రాసెస్ చేసిన, ఉప్పగా ఉండే ఆహారాలు తినడం వల్ల కిడ్నీలపై భారం పడుతుంది. చలి వల్ల వ్యాయామం తగ్గించడం జీవక్రియపై ప్రభావం చూపుతుంది.

ఎవరు ఎంత నీరు తాగాలి: పని స్వభావాన్ని బట్టి నీరు తాగే పరిమాణం మారాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులు, డెలివరీ బాయ్స్, సెక్యూరిటీ గార్డులు రోజుకు 3 నుండి 4 లీటర్ల నీరు తాగాలి. ఐటీ నిపుణులు, అకౌంటెంట్లు ఏసీ గదుల్లో ఉండటం వల్ల రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు సరిపోతుంది.

గోరువెచ్చని నీరే శ్రీరామరక్ష: చలికాలంలో చల్లని నీటికి బదులు గోరువెచ్చని నీరు తాగడం కిడ్నీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా వ్యర్థాలను సమర్థవంతంగా బయటకు పంపుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఆహారంలో మార్పులు: ఉప్పు తగ్గించండి: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే మూత్రంలో కాల్షియం పెరిగి కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఆక్సలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, దుంపలు, చాక్లెట్ మరియు అధికంగా టీ తాగడం నియంత్రించాలి. పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు మరియు గింజలు ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.

వ్యాయామం మరువకండి: చలి అని దుప్పటి ముసుగుతన్ని పడుకోకుండా రోజూ కనీసం కొద్దిసేపు నడక లేదా ఏవైన వ్యాయామాలు చేయాలి. ఇది శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. కిడ్నీలు మన శరీరానికి ఫిల్టర్లు వంటివి. వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. తగినంత నీరు తాగుతూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఈ చలికాలంలో కిడ్నీ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు.