
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు చల్లదనం కోసం ఏసీల వినియోగాన్ని పెంచుతున్నారు. అయితే ఏసీల అధిక వినియోగం కారణంగా విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సరైన విధంగా ఏసీ ఉపయోగిస్తే విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

BEE (బూరెలు అఫ్ ఎనర్జీ ఎఫీసియేన్సీ) సూచనల ప్రకారం.. ఏసీని చాలా తక్కువ ఉష్ణోగ్రతలైన 16 లేదా 18 డిగ్రీల వద్ద ఉంచడం అవసరం లేదు. మానవ శరీరానికి అనుకూలమైన ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా పేర్కొంటున్నారు. ఈ స్థాయిలో ఏసీని ఉంచడం ద్వారా కూలింగ్ సరిపడగా లభించడంతో పాటు విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. పరిశోధనల ప్రకారం ఉష్ణోగ్రతను ఒక్కో డిగ్రీ పెంచినప్పుడే సుమారు 6 శాతం వరకు విద్యుత్ ఆదా సాధ్యమవుతుంది.

ఇంకా ఏసీని దీర్ఘకాలం ఉపయోగించకుండా వదిలేసిన తర్వాత నేరుగా ఆన్ చేయడం వల్ల పనితీరు తగ్గి విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వేసవి ప్రారంభానికి ముందు సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. యంత్రంలో పేరుకుపోయిన దుమ్ము, ధూళి కారణంగా ఏసీ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది.

ఏసీ ఆన్ చేసే ముందు గది తలుపులు, కిటికీలు బిగిగా మూసివేయడం కూడా కీలకం. దీనివల్ల చల్లని గాలి బయటకు వెళ్లకుండా, వేడి గాలి లోపలికి రాకుండా ఉంటుంది. ఫలితంగా ఏసీపై అదనపు భారం పడదు. అదనంగా కొత్త ఏసీలలో ఉన్న ‘స్లీప్ మోడ్’ ఫీచర్ను వినియోగించడం ద్వారా 30–35 శాతం వరకు విద్యుత్ ఆదా చేయవచ్చు.

ఈ మోడ్ గది ఉష్ణోగ్రతను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది. అలాగే ఏసీతో పాటు ఫ్యాన్ను ఉపయోగిస్తే చల్లని గాలి గదిలో సమానంగా వ్యాపించి, తక్కువ ఉష్ణోగ్రత అవసరం లేకుండా ఉంటుంది. చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా వేసవిలో కూడా చల్లదనం పొందుతూ విద్యుత్ బిల్లులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.