
ఆసియా కప్ 2025 ఈ ఏడాది సెప్టెంబర్లో ఇండియాలో జరగనుంది. దీనికి సంబంధించి ఇటీవలె సోని స్పోర్ట్స్ ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. సాధారణంగా ఆసియా కప్ను వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తారు. గతంలో ఒకసారి టీ20 ఫార్మాట్లోనూ నిర్వహించారు.

అయితే.. ఈ సారి కూడా ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లోనే నిర్వహించనున్నారు. అందుకు కారణం ఏంటంటే.. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2026 జరగనుంది. ఈ మెగా టోర్నీకి కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇలా టీ20 వరల్డ్ కప్ కంటే ముందు జరిగే ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తుంటారు. ఎందుకంటే.. టీ20 ఫార్మాట్కు ఆటగాళ్లు అలవాటు పడతారని, టీ20 వరల్డ్ కప్కు ఈ ఆసియా కప్ ఒక ప్రీ టోర్నీలా పనికొస్తుందని అలా నిర్వహిస్తారు. ఈ సారి కూడా అలానే చేయనున్నారు

కానీ, టీమిండియా క్రికెట్ అభిమానులు మాత్రం ఈ సారి టీ20 ఫార్మాట్లో వద్దని వన్డే ఫార్మాట్లోనే ఆసియా కప్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్ వెనుక ఒక కారణం ఉంది. అదేంటంటే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను మిస్ అవుతున్నాం.. వారి ఆట చూడాలంటే.. ఆసియా కప్ 2025 వన్డే ఫార్మాట్లోనే నిర్వహించాలని కోరుతున్నారు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ విజయం తర్వాత పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొన్ని వారాల క్రితం టెస్టు ఫార్మాట్కు కూడా ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక వీరిద్దరూ టీమిండియా తరఫున కేవలం వన్డేల్లోనే కనిపిస్తారు. అందుకే వీరిద్దరి కోసం ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో కాకుండా వన్డే ఫార్మాట్లో నిర్వహించాలని కోరుతున్నారు. అలా అయితే రోహిత్, కోహ్లీ ఆటను ఇంకాస్త ఎక్కువ చూడొచ్చని వారి ఆశ.