
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. బుధవారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈనెల 17వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. హేమాహేమీలు కాంగ్రెస్, బీజేపీ తరపున ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాని మోదీ ఇండోర్లో భారీ రోడ్షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇండోర్లో ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. స్థానికులు మోదీపై పూలవర్షం కురిపించారు. కిలోమీటర్ల మేర మోదీ రోడ్షో సాగింది. స్థానికులు మోదీ మోదీ.. అంటూ నినాదాలు చేస్తూ ప్రధానికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాహుల్గాంధీ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తుఫాన్ వస్తుందనీ, 150 సీట్లు సాధించడం ఖాయమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొనడంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబం కోసమే పనిచేస్తుందనీ, ప్రజల కుటుంబాల గురించి పట్టించుకోదంటూ ప్రధాని మోదీ విమర్శించారు.

కాంగ్రెస్ నేతలు కోట్లాది రూపాయల అవినీతి చేస్తూ, పెట్టుబడిదారులను తరిమేశారంటూ ప్రధాని మోదీ గుర్తుచేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి రికార్డులు సృష్టిస్తామని ప్రధాని మోదీ అన్నారు. BJP మీద ప్రజలకున్న నమ్మకం అద్భుతమని, వారి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయన్నారు. ఢిల్లీలో కూర్చుని లెక్కలు వేసేవారికి ఇది అర్థం కాదంటూ కాంగ్రెస్ నేతలకు చురకలు పెట్టారు.

వెనకబడిన వర్గాలకు కాంగ్రెస్ వ్యతిరేకమని, BJP అగ్రనేత అమిత్ షా విమర్శించారు. OBCల గురించి మాట్లాడినంత మాత్రాన, ఓట్లు వస్తాయని రాహుల్గాంధీ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు.

కానీ మండల్ కమిషన్ నివేదిక రాజీవ్గాంధీ అమలు చేయలేదని మధ్యప్రదేశ్లోని రేవా బహిరంగసభలో గుర్తుచేశారు. కానీ ప్రధాని మోదీ మాత్రం వెనకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగబద్దత కల్పించారని అమిత్ షా చెప్పారు.