
ఏపీలోని నిరుద్యోగులకు హోంమంత్రి వంగలపూడి అనిత శుభవార్త అందించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తామనేది చెప్పేశారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. దీని ద్వారా పోలీస్, జైళ్ల, అగ్నిమాపక శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

త్వరలోనే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనున్నట్లు హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఇప్పటికే 6 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని, అలాగే వారికిచ్చే స్ట్రైఫండ్ను కూడా మూడు రేట్లు పెంచినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లల్లో జైలు, అగ్నిమాపక శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేయలేదని, తాము ఎప్పటికప్పుడు చేయనున్నట్లు పేర్కొన్నారు

గత ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైందని అనిత ఆరోపించారు, తాజాగా నెల్లూరు జైలును అనిత సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలు తయారుచేస్తున్న వస్తువులను పరిశీలించారు. అలాగే ఖైదీలకు అందిస్తున్న వసతుల గురించి ఆరా తీశారు.

ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను అనిత ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, రప్పా రప్పా అంటూ హడావుడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో నేరాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

అలాగే ఖైదీలకు జైల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు అనిత తెలిపారు. షాంపూలు, నూనె, స్కూల్ బెంచీలు వంటివి తాయరుచేస్తున్నారని, దీని వల్ల నెలకు రూ.8 వేల వరకు సంపాదిస్తున్నట్లు చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకనేవారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.