ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. శీతాకాలం ప్రారంభం కావడంతో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఫ్రెష్గా మంచు వర్షం కురుస్తోంది. కశ్మీర్లోని రజ్దాన్ పాస్, పీర్ కి గాలి, జోజిలా పాస్, సింథాన్ టాప్, సోనామార్గ్, గుల్మార్గ్తో సహా లోయలోని ఎత్తైన ప్రాంతాలలో మంచు కురుస్తోంది. దీంతో ట్రాఫిక్కు కూడా అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా రజ్దాన్, జోజిలా, కిష్త్వార్, అనంత్నాగ్, మొఘల్ రోడ్లతో సహా అనేక రహదారులు ట్రాఫిక్ కోసం మూసివేశారు.
శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారి రాంబన్ జిల్లా మెహర్ ప్రాంతంలో శుక్రవారం రోడ్డుపై కొండచరియలు విరిగిపడి, రాళ్లు పడడంతో ట్రాఫిక్ను మళ్లించారు. ఆ మార్గం మూసివేశారు. హైవేను కూడా త్వరలో ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నవంబర్ 10న కురిసిన వర్షం, హిమపాతం కారణంగా ఇక్కడ వాతావరణ పరిస్థితి మరింత దిగజారిపోయింది. చాలా ప్రాంతాలకు కుప్వారా అడ్మినిస్ట్రేషన్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వాతావరణం అనుకూలించే వరకు ఈ ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. వర్షపాతం క్రమంగా తగ్గుతుందని వాతావరణ శాఖ (మెట్) అంచనా వేసింది.
హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్-స్పితిలో కూడా తాజా మంచు కారణంగా రోడ్లపై తెల్లటి మంచు పరుచుకుంది. దట్టమైన మంచు కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టూ ఉన్న పర్వతాలపై తెల్లటి పలకలు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
గుల్మార్గ్తో సహా కాశ్మీర్లోని ఎగువ ప్రాంతాలలో దట్టంగా కురుస్తున్న మంచు, అడపాదడపా వర్షాలు మైదానాలను ముంచెత్తాయి. హిమపాతానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.