
నర్సరీలలో మాదిరిగా కుండీ కనిపించనంత గుబురుగా మనీ ప్లాంట్ పెరగాలంటే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు, సరైన ఎరువుల నిర్వహణ ఎంతో అవసరం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మనీ ప్లాంట్ కోసం పెద్ద కొమ్మలు కాకుండా, కనుపులు ఉన్న చిన్న చిన్న కొమ్మలను ఎంచుకోవాలి. కనుపుల వద్ద నుంచే వేర్లు సులభంగా వస్తాయి.

కొమ్మలను మట్టిలో నాటేటప్పుడు నిలువుగా గుచ్చకుండా కొద్దిగా ఏటవాలుగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కనుపులు మట్టిని తాకి వేర్లు వేగంగా విస్తరిస్తాయి. మనీ ప్లాంట్ వేర్లు స్వేచ్ఛగా పెరగడానికి మట్టి చాలా తేలికగా ఉండాలి. సమాన పాళ్లలో ఎర్రమట్టి, కోకోపీట్ లేదా ఇసుక, వరిపొట్టు కలుపుకోవాలి.

మట్టిని నీడలో ఉంచుతాం కాబట్టి ఫంగస్ రాకుండా ఉండేందుకు వేపపిండి తప్పనిసరిగా కలపాలి. అలాగే ఆకులు నిగనిగలాడే ఆకుపచ్చ రంగులో మెరవడానికి నైట్రోజన్, మెగ్నీషియం పుష్కలంగా ఉండే 'ఎప్సమ్ సాల్ట్' ఒక చెంచా కలపాలి. ఎప్సమ్ సాల్ట్ లేకపోతే మూడు నుంచి నాలుగు చెంచాల వాడిన టీ పొడిని కూడా ఎరువుగా వాడుకోవచ్చు.

మనీ ప్లాంట్కు కాస్త పెద్ద సైజు కుండీని ఎంచుకోవాలి. కుండీ అడుగున ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనీ ప్లాంట్ కుండీలో నీరు నిలిచిపోతే వేర్లు కుళ్ళిపోయి ఆకులు రాలిపోతాయి. హోల్స్ పై రాళ్లు లేదా కొబ్బరి చిప్పలను ఉంచి ఆపై మట్టిని నింపాలి. కుండీ మధ్యలో ఒక మాస్ స్టిక్ లేదా పైపును సపోర్ట్గా ఉంచితే మొక్క పైకి పాకుతూ అందంగా కనిపిస్తుంది.

మనీ ప్లాంట్ను నేరుగా తీవ్రమైన ఎండలో అస్సలు పెట్టకూడదు. బాల్కనీలో లేదా ఇంట్లో పరోక్ష వెలుతురు వచ్చే నీడ ప్రదేశంలో ఉంచాలి. మట్టి పైపొర ఆరినప్పుడు మాత్రమే నీరు పోయాలి. కొత్తగా నాటిన తర్వాత మొదటి రెండు నెలల వరకు బియ్యం కడిగిన నీళ్లు తప్ప వేరే రసాయన ఎరువులు ఇవ్వకూడదు. ఈ సులువైన చిట్కాలు పాటిస్తే కొద్ది నెలల్లోనే మీ ఇంట్లోని మనీ ప్లాంట్ కుండీ నిండా ఎంతో పచ్చగా, గుబురుగా పెరుగుతుంది!