
ఈ టీ పొడి 24 ఏళ్ల క్రితమే వేలంపాటలో రికార్డులు నమోదు చేసింది. 2002లో జరిగిన ఒక వేలంలో కేవలం 20 గ్రాముల ఈ టీ పొడిని ఒక ధనవంతుడు సుమారు రూ.18 నుండి 20 లక్షలకు కొనుగోలు చేశాడు. అంటే ఈ లెక్కన ఒక్క కప్పు టీ తాగాలంటే దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మార్కెట్లో దొరికే బంగారం ధర కంటే దాదాపు 30 రెట్లు ఎక్కువ.

ఎందుకంత ఖరీదు?: ఈ టీ ఇంత ఖరీదు కావడానికి ప్రధాన కారణం దాని లభ్యత. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్లో ఉన్న వుయిషాన్ పర్వతాలలోని కొండ చరియల మధ్య పెరిగే కొన్ని పురాతన తల్లి చెట్ల నుండి మాత్రమే ఈ టీని సేకరిస్తారు. ఈ చెట్లు ఏడాదికి కేవలం కొన్ని వందల గ్రాముల టీని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. ఈ చెట్లు చైనా ప్రభుత్వ ఆస్తి. వీటి ప్రాముఖ్యత దృష్ట్యా, గతంలో ఈ చెట్లను కాపాడటానికి సాయుధ సైనికులను కూడా మోహరించేవారు. ప్రస్తుతం ఈ పురాతన చెట్ల నుండి టీ సేకరణను ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది. ఇది వీటి విలువను మరింత పెంచింది.

పేరు వెనుక ఉన్న రాజసం: చైనీస్ భాషలో ఈ పేరుకు పెద్ద ఎర్రని వస్త్రం అని అర్థం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పురాతన కాలంలో ఒక చక్రవర్తి తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు, ఈ టీ తాగడం వల్ల ఆమె కోలుకుందట. దానికి కృతజ్ఞతగా ఆ చక్రవర్తి తన రాజరికపు ఎర్రటి వస్త్రాన్ని ఆ టీ చెట్లపై కప్పాడట. నాటి నుండి దీనికి ఆ పేరు స్థిరపడిపోయింది.

ఆరోగ్య ప్రయోజనాలు: ఈ టీ కేవలం విలాసం మాత్రమే కాదు, ఇందులో అద్భుతమైన ఆరోగ్య గుణాలు ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుందని, అనేక దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తుందని వారి నమ్మకం.

సామాన్యులకు దొరుకుతుందా?: వందల ఏళ్ల నాటి అసలైన తల్లి చెట్ల టీ బిలియనీర్లకు కూడా దొరకడం ఇప్పుడు కష్టమే. అయితే అవే చెట్ల కొమ్మల నుండి అంటుకట్టి పెంచిన కొత్త తరం టీ మొక్కల ద్వారా లభించే టీ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ధర కిలోకు సుమారు రూ. 8,000 నుండి ప్రారంభమవుతుంది. టీ అంటే ప్రాణమిచ్చే వారు ఈ రకమైన టీని రుచి చూడవచ్చు.