
తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే. ఆ రామాయణాన్నే సరికొత్తగా తెరకెక్కించబోతున్నారు బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ. రామాయణ సిన్మా బడ్జెట్ గురించి ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా చెప్పగానే.. నిజమేనా అంటూ ఆశ్చర్యపోయారంతా.

అవును.. రామాయణ బడ్జెట్ అక్షరాలా 4000 కోట్లు. ఇప్పటిదాకా ఇంత భారీ బడ్జెట్తో ఏ భారతీయ సిన్మా కూడా తెరకెక్కలేదు. అందుకే అంత సంచలనం సృష్టిస్తోంది ఆ సిన్మా టీజర్. ఈ భారీ సిన్మా కోసం ఏడేళ్లక్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఏ భారతీయ సినిమా కూడా ‘రామాయణ’ దరిదాపుల్లోకి రాలేదంటున్నారు ప్రొడ్యూసర్. రెండు పార్టులుగా ఈ సిన్మా తీయాలనే ప్లాన్తో ఉన్నారు.

భారీ బడ్జెట్ రామాయణ సిన్మాలో నటీనటుల ఎంపిక కూడా ఆసక్తి రేపుతోంది. రాముడి పాత్ర పోషించబోతున్నారు బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్. సీత పాత్రకోసం టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకున్నారు. లక్ష్మణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. ఇక రావణుడు ఎవరో తెలుసా.. కన్నడ సూపర్స్టార్ యశ్. హనుమంతుడి పాత్రలో సన్నీడియోల్ నటిస్తున్నారు. ఇక కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్ప్రీత్సింగ్ ఉన్నారనే వార్తలతో సిన్మాకి హైప్ పెరిగింది.

ఇంత బడ్జెట్, ఇంత గొప్పగొప్ప స్టార్స్ ఉన్న సిన్మా ఎలా ఉంటుందనే ఆసక్తి అప్పుడే మొదలైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రామాయణ మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదలవుతాయి. నితేశ్ తివారీ డైరెక్షన్లో రెడీ అవుతున్న రామాయణ సినిమాను అన్ని భారతీయ భాషలతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, జపనీస్, మాండరీన్, స్పానిష్ తదితర భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయనుంది.

ఒకప్పుడు రామానంద్ సాగర్ రామాయణం ప్రజలపై చెరగని ముద్రవేసింది. 2013లో బుల్లితెరపై ప్రసారమైన మహాభారతం ఇప్పటిదాకా అత్యంత ఖరీదైన షో. దాన్ని 100 కోట్ల బడ్జెట్తో నిర్మించారు ప్రొడ్యూసర్లు. బాలీవుడ్ భారీ బడ్జెట్తో మరో రామాయణాన్ని రూపొందిస్తున్న సమయంలోనే.. హైదరాబాద్ ఫిల్మ్సిటీలో శ్రీమద్ భాగవతం పార్ట్ 1 షూటింగ్కి క్లాప్ కొట్టారు. రామానంద్సాగర్ మనవడు ఆకాష్ సాగర్ చోప్రా ఈ ఇతిహాసిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అటు రామాయణం, ఇటు శ్రీమద్భాగవతం సిన్మాలతో వెండితెరపై ఇతిహాస దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. దశాబ్దాల క్రితమే మహాభారత్ని ప్రేక్షకులు భక్తి తన్వయత్మంతో వీక్షించేవారు. తరాలు మారినా రామాయణ, మహాభారత గాథలు ఎప్పటికీ జనరంజకమే.