
అదేంటి అంత నమ్మకంగా థ్రిల్లర్ సినిమా తీస్తుంటే బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు.. అదేం లాజిక్ అనుకుంటున్నారా..? ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంత సక్సెస్ పర్సంటేజ్ ఇప్పుడు థ్రిల్లర్ మూవీస్ కు కనిపిస్తోంది.

కాస్త ఎంటర్టైన్ చేసి ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సినిమా చేస్తే చాలు కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకాలు ప్రేక్షకులు దర్శక నిర్మాతలకు ఇస్తున్నారు. ముఖ్యంగా 2023 లో ఈ తరహా థ్రిల్లర్ సినిమాలు చాలా వరకు ఆకట్టుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి.

తాజాగా విడుదలైన మంగళవారం కూడా అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొస్తుంది. అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఒక కొత్త పాయింట్ తీసుకొని దానికి తనదైన స్క్రీన్ ప్లే జోడించి మంగళవారం సినిమాను తెరకెక్కించాడు అజయ్ భూపతి.

ఈ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. మధ్యలో వరల్డ్ కప్ ఫైనల్ రోజు మాత్రం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి కానీ మళ్ళీ వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ బాగానే తెస్తుంది మంగళవారం. దీనికంటే ముందు మా ఊరి పొలిమేర 2 కూడా అద్భుతమైన విజయం సాధించింది.

సత్యం రాజేష్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇందులో హీరోగా నటించిన కూడా.. కేవలం కంటెంట్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. బన్నీ వాసు ఈ సినిమాను విడుదల చేయగా.. దాదాపు 6 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది మా ఊరి పొలిమేర 2.

దానికి ముందు సమ్మర్ సీజర్ లో విడుదలైన విరూపాక్ష కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కం బ్యాక్ సినిమాగా వచ్చిన విరూపాక్ష.. ఆయనకు ఊహించిన దానికంటే ఎక్కువ కమ్ బ్యాక్ ఇచ్చింది.

దాదాపు 45 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది విరూపాక్ష. ఇది కూడా ఒక ఊర్లో జరిగే కథ. కాస్త జాగ్రత్తగా స్క్రీన్ ప్లే రాసుకొని రొటీన్ స్టోరీ తో వచ్చినా కూడా బ్రేక్ ఇవ్వడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు పిండం అనే మరో సినిమా కూడా వస్తుంది.

ఇది కూడా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్. పైగా ఒక్కరు సినిమా చూస్తే భయపడతారు అంటూ దర్శక నిర్మాతలు కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఏదేమైనా కాస్త మనసు పెట్టి సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.