
రెండు పెన్షన్ల ప్రయోజనం ఎలా పొందవచ్చనే పూర్తి వివరాలను పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ విడుదల చేసింది. ఈ రెండు పెన్షన్ నియమాలలో కొన్ని షరతులు విధించారు. ఆ షరతులకు లోబడి రెండు పెన్షన్ల ప్రయోజనాన్ని తీసుకోవచ్చు.

పెన్షన్ డిపార్ట్మెంట్ ప్రకారం..భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయిఉండి.. వారిలో ఒకరు సర్వీసు సమయంలో లేదా రిటైర్మెంట్ తర్వాత మరణిస్తే, అప్పుడు జీవించి ఉన్న ఇద్దరిలో ఎవరికైనా కుటుంబ పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది. భర్త చనిపోతే, భార్య కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతుంది. భార్య మరణం తరువాత, భర్త కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతాడు. ఇద్దరూ చనిపోతే, బతికున్న బిడ్డకు తల్లి అదేవిధంగా తండ్రి ఇద్దరి పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది.

పెన్షన్ డిపార్ట్మెంట్ చెబుతున్న దానిప్రకారం..తల్లిదండ్రులు జీవించి ఉండగా భర్త నుండి విడాకులు జరిగినా లేదా భర్త మరణించినా మాత్రమే కుటుంబ పెన్షన్ ప్రయోజనం వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెకు లభిస్తుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడిన కుమార్తె విడాకులు తీసుకుంటే, విడాకుల కేసు కోర్టులో నడుస్తుంటే మాత్రమే కుటుంబ పెన్షన్ ప్రయోజనం లభిస్తుంది.

ఒక పెళ్లికాని కుమార్తె కుటుంబ పెన్షన్ కోసం క్లెయిమ్ చేయగలదా అనే ప్రశ్నకు పెన్షన్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పింది. కుటుంబ పెన్షన్ క్లెయిమ్ చేయడానికి పెళ్లికాని కుమార్తెకు ఎలాంటి కాలపరిమితి నిర్ణయించలేదు. పెళ్లికాని కుమార్తె వివాహం చేసుకునే వరకు కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందవచ్చు. కూతురు వితంతువు లేదా విడాకులు తీసుకుంటే, పునర్వివాహం వరకు కుటుంబ పెన్షన్ ప్రయోజనం పొందవచ్చు. కుమార్తె అవివాహితురాలైతే, ఆమె ఉద్యోగం చేయనంత కాలం కుటుంబ పెన్షన్ ప్రయోజనాన్ని పొందే హక్కు ఆమెకు ఉంది.

మరణించిన ప్రభుత్వ ఉద్యోగులు లేదా పిల్లలు వికలాంగులైన పెన్షనర్ల కోసం, కుటుంబ పెన్షన్ విషయంలో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దాని గురించి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ పిల్లల శ్రేయస్సు, పెంపకాన్ని దృష్టిలో ఉంచుకుని, కుటుంబ పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి నిబంధనల్లో మార్పులు తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం.