
బెల్గాం జిల్లాలోని హుక్కేరి తాలూకా బస్తవాడ గ్రామంలో అరుదైన వేడుక కనువిందు చేసింది. కుల మత విభేదాలపై మానవత్వం సాధించిన విజయం సంచలనంగా మారింది. ముస్లిం దంపతులు మెహబూబ్ నాయక్వాడి, నూర్జన్ తమ దత్తపుత్రుడికి హిందూ హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేయడం ద్వారా యావత్ సమాజానికి ఒక ఆదర్శంగా నిలిచారు. ముస్లిం దంపతులు తమ దత్తపుత్రుడికి హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేయడం పట్ల ప్రజలు ప్రశంసలు కురిపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషాద సంఘటన మానవత్వాన్ని కదిలించింది. సోమశేఖర్ పూజర్, వసంత పూజర్ అనే ఇద్దరు అన్నాదమ్ములు బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ఆ సమయంలో సోమశేఖర్ వయస్సు నాలుగు సంవత్సరాలు, వసంత్ వయస్సు రెండు సంవత్సరాలు. వారి తల్లిదండ్రులు మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ ఆ పిల్లలను చూసుకోవడానికి ముందుకు రాలేదు. అందరూ వదిలేశారు.

ఆ సమయంలో వారి పక్కనే నివసిస్తున్న మెహబూబ్, నూర్జన్ అనే దంపతులు ముందుకు వచ్చి ఈ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. వారి ఐదుగురు పిల్లలతో పాటు వీళ్లను కూడా ప్రేమగా పెంచుకున్నారు. వేర్వేరు మతాలకు చెందిన వారు అయినప్పటికీ వారు ఈ పిల్లలను హిందూ సంప్రదాయం ప్రకారం పెంచారు. చదువు చెప్పించటంతో పాటు ఇతర రంగాలలో పిల్లలకు నైపుణ్యం ఇప్పించారు.

ఇప్పుడు పెద్దవాడైన సోమశేఖర్ పూజార్ హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో, మెహబూబ్ దంపతులు తల్లిదండ్రుల స్థానంలో నిలిచి మతపరమైన అన్ని కార్యక్రమాలను నిర్వహించారు.

కులం, మతం పేరుతో అల్లర్లు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఈ ముస్లిం దంపతులు చూపిన మానవత్వం, సంఘీభావం విస్తృతంగా ప్రశంసించబడింది. బస్తవాడ గ్రామంలో జరిగిన ఈ సంఘటన సామాజిక సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.