
డబ్బు పట్ల వ్యామోహం: డబ్బుతో ఏదైనా కొనవచ్చు.. కానీ డబ్బు మాత్రమే జీవితం కాదని చాణక్యుడు స్పష్టం చేశారు. ధనం అవసరమే..కానీ అది వ్యామోహంగా మారకూడదు అని ఆయన చెప్పారు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతికే వ్యక్తి తన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, స్నేహితులను, చివరకు తన ఆనందాన్ని కూడా కోల్పోతాడు. డబ్బు వెంట పడి జీవితాన్ని పణంగా పెట్టవద్దని చాణక్య నీతి హెచ్చరిస్తోంది.

హోదా, ప్రతిష్టల ఉచ్చు: సమాజంలో గౌరవం ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ అడ్డదారిలో హోదాను, లేని ప్రతిష్టను దక్కించుకోవాలని చూడటం మనిషిని పెద్ద ఇబ్బందుల్లో పడేస్తుంది. చాలామంది సమాజంలో గొప్పగా కనిపించడానికి తప్పుడు మార్గాలను ఎంచుకుంటారు. అయితే అది తనను తాను మోసం చేసుకోవడమే అవుతుందని చాణక్యుడు చెప్పారు. ఇలాంటి ఆశలు ఒకరోజు మనిషిని పతనం వైపు తీసుకెళ్తాయి.

స్వార్థపూరిత సంబంధాలు: మన జీవితంలో ఉండే చాలా బంధాలు స్వార్థం మీదనే ఆధారపడి ఉంటాయని చాణక్యుడు నిర్మొహమాటంగా చెప్పారు. మన దగ్గర ఏదైనా ఆశించి వచ్చే వ్యక్తులు, వారి అవసరం తీరగానే దూరమైపోతారు. అలాంటి సంబంధాలను గుర్తుపట్టకుండా వాటిలో అతిగా లీనమైతే వారు దూరమైనప్పుడు కలిగే మానసిక వేదన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. అందుకే ఎవరితోనైనా మితిమీరిన అనుబంధం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

అంతం లేని భౌతిక సుఖాలు: భౌతిక సుఖాలకు అంతు ఉండదు. ఒక కోరిక తీరగానే మరొకటి పుడుతూనే ఉంటుంది. విలాసవంతమైన జీవితం అలవాటైన మనిషికి సంతృప్తి అనేది ఉండదు. అవి పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు. ఈ సుఖాల వేటలో మనిషి తన సమయాన్ని, శక్తిని వృథా చేసి చివరకు శూన్యంతో మిగిలిపోతాడు.

చాణక్యుడి ప్రకారం.. జీవితంలో ఏదీ కూడా మితం తప్పకూడదు. అవసరాలను దాటి ఆశలు పెరిగినప్పుడు అది వినాశనానికి దారితీస్తుంది. సంపాదనలో నిజాయితీ, బంధాల్లో స్పష్టత, కోరికలపై నియంత్రణ ఉన్నప్పుడే మనిషి నిజమైన ఆనందాన్ని పొందగలడు.