BJP vs Mamatha: మమత డోర్ తెరిస్తే బెంగాల్లో బీజేపీ ఖాళీనేనా?.. ముకుల్రాయ్తో మొదలైన వలసలు, ఆయనతోనే ఘర్వావసీ షురూనా?
బెంగాల్లో ఎన్నికలు పూర్తి అయినా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ దీదీ మధ్య వార్ నడుస్తున్నట్లు కనబడుతుంది.
BJP vs Mamatha: బెంగాల్లో ఎన్నికలు పూర్తి అయినా రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. కేంద్రంలోని బీజేపీ వర్సెస్ దీదీ మధ్య వార్ నడుస్తున్నట్లు కనబడుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమత బెనర్జీకి అధికారాన్ని దూరం చేయాలని బీజేపీ సర్వశక్తులను ఒడ్డినప్పటికీ ఫలితం కనబడలేదు. దీదీ పోటీ చేసిన నందిగ్రామ్ లో అయితే ఓడించారు. కానీ రాష్ట్రంలో టీఎంసీ విజయాన్ని బీజేపీ అడ్డుకోలేకపోయింది. మరోవైపు, బెంగాల్లో కషాయం కండువా కనబడకుండా చేసేందుకు ఎత్తుకు పైఎత్తులు నడుస్తున్నాయి. బీజేపీలో చేరిన నేతలకు ఘర్వావసీ తప్పకుండా ఉంటుందని సీఎం మమతా బెనర్జీ సూచనప్రాయం తెలిపారు.
అయితే, మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ పరిపాలనలో ఇరుకున పెట్టే చర్యలను కేంద్రం కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల నారద టేపుల కేసుకు సంబంధించి టీఎంసీ మంత్రులను సీబీఐ అరెస్టు చేసింది. ఆ సమయంలో మమతా బెనర్జీ వారి కోసం సీబీఐ ఆఫీసు వద్దకు వెళ్లి మరీ ఆందోళన చేశారు.
మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్లోకి రివర్స్ మైగ్రేషన్ ట్రెండ్ నెలకొంది. టీఎంసీ ఘన విజయం నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుదారులంతా మళ్లీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2017లో మమతకు తొలి షాక్ ఇచ్చి పార్టీని విడిచి పెట్టిన బీజేపీ నేత ముకుల్ రాయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే, గత మార్చిలో బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహా, ఫుట్బాల్ క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు దీపేందు బిస్వాస్ టీఎంసీ జెండా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరితోపాటు సరాలా ముర్ము , అమల్ ఆచార్య తదితరులుకూడా ఇదే బాటలో ఉన్నట్టు పీటీఐ సమాచారం.
అంతేకాదు ఏడు నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు లేదా నలుగురు బీజేపీ సిట్టింగ్ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్లో చేరాలనే కోరికను వ్యక్తం చేశారని తృణమూల్ ప్రతినిధి కునాల్ ఘోష్ మీడియాకు వెల్లడించారు. అయితే, దీనిపై పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ నాయకులు ఎన్నికలకు ముందే పార్టీని విడిచిపెట్టిన క్రమంలో కార్యకర్తల కృషితో మమతా నాయకత్వంలో విజయం సాధించాం కనుక వారి మనోభావాలను కూడా గౌరవించాల్సి ఉందన్నారు. అయితే, ముకుల్ రాయ్ మళ్లీ టీఎంసీలో చేరనున్నారన్న వార్తలను బీజేపీ కొట్టి పారేసింది.
అయితే, బీజేపీలో చేరిన టీఎంసీ నేతలంతా తిరిగి సొంతగూటికి చేరుకునేందుకు తహతహలాడుతున్నారు. బీజేపీలో చేరిన నేతలకు ఘర్వావసీ తప్పకుండా ఉంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఒకప్పుడు మమతకు కుడిభుజంలా వ్యవహరించిన ముకుల్రాయ్ చాలా రోజుల క్రితమే బీజేపీలో చేరారు. అయితే, ఇప్పుడు మాత్రం ఆయన మనస్సు మారినట్టు తెలుస్తోంది. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముకుల్రాయ్ భార్యను మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ స్వయంగా పరామర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇది జరిగిన వెంటనే ముకుల్రాయ్కు స్వయంగా ప్రధాని మోదీ ఫోన్ చేశారు. తృణమూల్ నేతల ఘర్వాపసీపై ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిది మంది సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేలు , నలుగురు సిట్టింగ్ బీజేపీ ఎంపీలు కూడా తృణమూల్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. అయితే బీజేపీ నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణ లోకి తీసుకుంటామని వెల్లడించారు. ఈ నేతలంతా ఎన్నికల సమయంలో పార్టీని వీడారని , కార్యకర్తలే పార్టీని గెలిపించారని తెలిపారు.
అయితే బీజేపీ నేతలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. చాలామంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని భావించి ఆ పార్టీలో చేరారు. కాని అనూహ్యంగా తృణమూల్ హ్యట్రిక్ కొట్టడంతో ఆ నేతలకు భంగపాటు ఎదురయ్యింది. ఇలాంటి నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీజేపీ విమర్శించింది. అయితే కొంతమంది కీలక నేతలను మాత్ర మమత తప్పకుండా టీఎంసీలో చేర్చుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.