
రూ.97 వేల కోట్లు.. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 97 వేల 921 కోట్ల రూపాయలు. ఇది ప్రభుత్వ అప్పు కాదు.. ప్రభుత్వానికి ప్రజలు బకాయిపడ్డ సొమ్ము. దేశవ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్ల లెక్క ఇది. అయితే ఈ 97 వేల కోట్ల రూపాయలు కూడా 2023 వరకూ ఉన్న లెక్క. గత ఏడాది పెండింగ్ చలాన్ల సంఖ్య 61 శాతం పెరిగింది. ఆ లెక్కలు కూడా కలుపుకుంటే లక్ష కోట్ల రూపాయలు ఈజీగా దాటిపోతుందని చెబుతున్నారు అధికారులు. మరి ఈ పెండింగ్ చలాన్ల లిస్ట్లో టాప్లో ఉన్న స్టేట్ ఏంటి..? లీస్ట్లో ఉన్న స్టేట్ ఏంటి..? మన తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్కడ..? ఆ లెక్కలపై డిటైల్డ్ అనాలసిస్ తెలుసుకుందాం..
గమ్యం చేరే తొందరలో కొంతమంది వాహనదారులు ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తుంటారు. దాంతో వారికే కాక..తోటి వారికి కూడా రిస్కే. అలాంటివారి ఆట కట్టించేందుకు భారీగా ట్రాఫిక్ చలానాలు విధిస్తున్నారు పోలీసులు. అలాగే ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా ఫైన్ వేస్తుంటారు. కానీ వాహనదారులు మాత్రం ఆ ఫైన్లను లైట్ తీసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో కేవలం 40 శాతం మాత్రమే చలానాలు క్లియర్ అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ శాతం మరీ దారుణంగా 14 శాతం మాత్రమే ఉంటోంది. దీంతో ఏటికేడు పెండింగ్ చలానాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది.
ట్రాఫిక్ చలానాల వసూళ్లలో 76 శాతంతో రాజస్థాన్ టాప్ప్లే్స్లో ఉండగా.. 69 శాతంతో మహారాష్ట్ర, హర్యానా సెకండ్ ప్లేస్లో నిలిచాయి. ఇక ట్రాఫిక్ వసూళ్లలో 14 శాతంతో లిస్ట్లో ఢిల్లీ ఉంటే ఆ తర్వాతి స్థానంలో 21 శాతంతో కర్ణాటక నిలిచింది. ఢిల్లీలో ఈ ఏడాది 4 వేల 468 కోట్ల రూపాయల విలువైన ట్రాఫిక్ చలానాలు ఇష్యూ చేస్తే వాటిలో వసూలయింది కేవలం 645 కోట్ల రూపాయలు మాత్రమే. దీంతో ఢిల్లీలో పెండింగ్ చలానాల క్లియరెన్స్కు అధికారులు ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. తీవ్ర ఉల్లంఘనల కింద రాని ట్రాఫిక్ చలాన్లను లోక్ అదాలత్లో పరిష్కరించుకునే ఛాన్స్ ఉంది.
ఇక పెండింగ్ చలాన్లలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తూ 2025 ఆగస్ట్ 31 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల 78 వేల 292 చలానాలు జారీ అయ్యాయి. వీటి విలువ 240 కోట్ల 32 లక్షల రూపాయలు. అయితే వీటిలో 31 లక్షల 9 వేల చలానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్లో ఉన్న చలానాల విలువ 60 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మన తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది 20 లక్షల చలానాలు జారీ అయ్యాయి. వాటిలో పెద్దమొత్తంలో చలానాలు పెండింగ్లోనే ఉన్నాయి. పెండింగ్ చలానాల వసూళ్లకు 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ ప్రభుత్వం స్పెషల్ డిస్కౌంట్ స్కీమ్ను అమలు చేసింది. దీంతో కోటి 67 లక్షల చలానాలు క్లియర్ అయ్యాయి. వీటి నుండి ప్రభుత్వానికి 150 కోట్ల 58 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.
చలానాల జారీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరు విధానాలను పాటిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ చట్టాల మేరకు ఏపీలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలానాలు జారీ చేస్తుంటే.. తెలంగాణ మాత్రం సొంత విధానాన్ని అమలు చేస్తోంది. ఏపీలో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తే.. తెలంగాణలో 200 రూపాయలు ఫైన్ వేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితో ఏపీలో 5 వేలు ఫైన్ వేస్తే.. తెలంగాణలో వెయ్యి రూపాయలు చలానా జారీ చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలానాలు జారీ చేసేందుకు సీసీ కెమెరాలు, అటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వంటి టెక్నాలజీని వాడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..