వాహనదారులకు కేంద్రం శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ గడువు పెంపు
డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Government extended vehicles validity: దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో వాహనాలకు సంబంధించి ద్రువపత్రాల వ్యాలిడిటీని పెంచాల్సిందిగా కేంద్ర రహదారి, రవాణా శాఖ సూచించింది. ఈమేరకు అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి 1, 2021 నుంచి మార్చి 31 మధ్య వ్యాలిడిటీ పూర్తయిన వారికే మాత్రమే ఇది వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. వీరందరికీ మరో మూడు నెలలపాటు వ్యాలిడిటీ పొడిగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే జూన్ 30వరకు వారి ద్రువపత్రాలు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.
ప్రస్తుత మోటార్ వెహికల్ చట్టం- 1988లోని నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ పూర్తయిన ఏడాదిలోపు ఎప్పుడైనా రెన్యువల్ చేసుకునే వీలుంది. అయితే, లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేసుకోలేకపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
గత ఏడాది మార్చి 30, జూన్ 9, ఆగస్టు 24, డిసెంబరు 27 తేదీల్లోనూ కేంద్రం ఇలాంటి సూచనలు జారీ చేసింది. మరోవైపు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసే సమయంలో టెస్ట్ డ్రైవ్లను మరింత కఠినతరం చేయాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. టెస్టు డ్రైవ్లో కచ్చితంగా పాసైన వారికి మాత్రమే వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో రోడ్డు ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.