దేవుడి మీద కూడా కోపం వస్తోంది.. మొన్న కుటుంబం మొత్తం.. ఇప్పుడు కాబోయే భర్త

|

Sep 12, 2024 | 8:23 AM

ఎందుకు దేవుడా మనుషులు జీవితాలతో ఇలా ఆడుకుంటావ్. ఏం పాపం చేసింది తను. ఎందుకీ శిక్ష. కుటుంబం మొత్తం దూరమైంది. అంత కష్ట సమయంలో అండగా ఓ మనిషి నిలిచాడు. అతడ్ని కూడా తీసుకెళ్లిపోవాలా..? వయనాడ్‌ బాధితురాలు శృతి జీవితంలో మరో పెను విషాదం చోటుచేసుకుంది.

దేవుడి మీద కూడా కోపం వస్తోంది.. మొన్న కుటుంబం మొత్తం.. ఇప్పుడు కాబోయే భర్త
Jenson - Shruthi
Follow us on

విధి కొన్నిసార్లు మనుషులపై పగ పడుతుందో తెలీదు. పాపం ఈ అమ్మాయి స్టోరీ తెలిస్తే మీ కళ్లు చెమ్మగిల్లడం ఖాయం. వయనాడ్ వరదల విధ్వంసానికి.. అమ్మానాన్నలు సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యుల్నికోల్పోయి.. తీరని శోకంలో ఉంది తను. గుండె దిటవు చేసుకుని కాస్త ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతోన్న క్రమంలో మరో ఊహించని కుదుపు. అవును.. తనకి కాబోయే భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆ యువతి బాధను వర్ణించడానికి మాటలు రాని పరిస్థితి ఎదురైంది.

కేరళలోని వయనాడ్‌ జిల్లా చూరాల్‌మల గ్రామానికి చెందిన 24 ఏళ్ల శృతికి తన చిన్ననాటి స్నేహితుడు జెన్సన్‌‌తో జూన్‌ 2న పెళ్లి జరగాల్సి ఉంది. మతాలు వేరైనా వారి ప్రేమకు కుటుంబ పెద్దలు అంగీకారం తెలిపారు. అయితే జూన్‌ 30న శృతి జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ప్రకృతి విధ్వంసం, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో తన తల్లిదండ్రులు, సోదరితో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులు మృత్యువాతపడ్డారు. గుండెలవిసేలా రోదిస్తూ.. నిర్వేద స్థితికి చేరుకున్న శృతికి జెన్సన్‌ తోడుగా నిలిచాడు. తన జాబ్ మానేసి మరీ..  కష్టకాలంలో ఆమె వెంటే నిలిచాడు.

మోదీ వరద ప్రాంతాలకు పర్యటనకు కేరళకు వెళ్లినప్పుడు ఈ జంట ఆయనతో మాట్లాడుతున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయి. నేషనల్ మీడియాలో సైతం వీరిపై కథనాలు ప్రసారం చేశాయి. ప్రకృతి ప్రకోపానికి బలైన కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు.. శ్మశానవాటికకు చేరుకొని.. జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలుస్తామని సమాధుల మధ్యే ఈ జంట ప్రమాణం చేశారు. సెప్టెంబర్‌లో తాము రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలిపారు.

అయితే ఆమెకు జాన్సన్‌తో కలిసి బతికే అవకాశం కూడా ఇవ్వలేదు ఆ దేవుడు. జాన్సన్ తాజాగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. సెప్టెంబర్‌ 10న శృతి, జెన్సన్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు. కోజికోడ్‌-కొల్లేగల్‌ నేషనల్ హైవేపే వీరి వాహనం, ఓ ప్రైవేట్‌ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో జెన్సన్‌ తీవ్రంగా గాయపడగా, శృతితో పాటు మిగతా వారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు వెంటనే సమీప ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో జెన్సన్‌ చికిత్స పొందుతూ..  బుధవారం రాత్రి మరణించాడు. తన చిరకాల మిత్రుడు, కాబోయే భర్త మృతి చెందడంతో శృతి జీవితం చీకటిమయంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..