లాక్ డౌన్ సడలింపులతో దేశంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పెద్ద ఎత్తున విపక్షాల సమావేశానికి సమాయత్తమవుతున్నారు. ఈ నెల 22 వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, వలస కార్మికుల తరలింపు, కేంద్రం ప్రకటించిన భారీ ఎకనామిక్ ప్యాకేజీ, పార్లమెంటు సమావేశాలు లేకపోయినా.. వివిధ పార్లమెంటరీ కమిటీల స్థంభన ఈ మీటింగ్ ప్రధాన అజెండాగా ఉండనుంది. ఈ సమావేశానికి 18 విపక్షాలను ఆహ్వానించారు. దీనికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అప్పుడే ప్రకటించారు. డీ ఎంకే అధినేత స్టాలిన్, ఎన్సీపీ అధినేత శరద్ పవర్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.