వెల్ డన్ ఛాంపియన్స్.. చాలా గర్వంగా ఉంది.. టీమిండియా గెలుపుపై ప్రధాని మోదీ ప్రశంసలు..

అహ్మదాబాద్ వేదికగా టీమిండియా సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన మూడోసారి టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ, భారత క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురిపించారు.

వెల్ డన్ ఛాంపియన్స్.. చాలా గర్వంగా ఉంది.. టీమిండియా గెలుపుపై ప్రధాని మోదీ ప్రశంసలు..
Pm Modi Congratulates Team India

Updated on: Mar 09, 2026 | 12:04 AM

భారత క్రికెట్ జట్టు మరోసారి గర్జించింది.అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను చిత్తు చేస్తూ భారత్ మూడోసారి T20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ఈ విజయంతో భారత్ కేవలం ట్రోఫీని గెలవడమే కాకుండా సొంత గడ్డపై టైటిల్ సాధించిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మూడోసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాను ఆయన ఆకాశానికెత్తారు. ఈ విజయం కేవలం క్రీడా విజయం మాత్రమే కాదని.. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు, ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని ప్రధాని కొనియాడారు.

ఛాంపియన్లకు మోదీ అభినందనలు

సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, భారత క్రికెటర్ల నైపుణ్యాన్ని అభినందించారు. ‘‘ఛాంపియన్స్.. మీ అద్భుతమైన నైపుణ్యం, దృఢ సంకల్పం దేశాన్ని గర్వపడేలా చేశాయి. ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది. వెల్ డన్ టీమిండియా’’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రుల అభినందనలు

ప్రధానితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా జట్టు విజయాన్ని అభినందించారు. ‘‘ఎంత అద్భుతమైన విజయం.. ప్రపంచ ఛాంపియన్లకు సెల్యూట్.. మీ అసాధారణ ప్రదర్శన దేశానికి గర్వాన్ని తెచ్చిపెట్టింది’’ అని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మన క్రికెటర్లు తమ అద్భుత నైపుణ్యంతో దేశాన్ని ప్రపంచ స్థాయిలో గర్వపడేలా చేశారని రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.

దంచికొట్టిన భారత్

కాగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్, కివీస్ బౌలర్లను ఆరంభం నుంచే ఊచకోత కోసింది.అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శాంసన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీరిద్దరూ మెరుపు అర్ధ సెంచరీలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. జస్ప్రీత్ బుమ్రా: తన స్పెల్‌తో మాయ చేస్తూ 4 వికెట్లు పడగొట్టి కివీస్ వెన్నెముక విరిచాడు. అక్షర్ పటేల్: కీలక సమయంలో 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోకుండా చేశాడు. న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.

Follow Us