నోరుజారుతున్న పాకిస్థానీయులు.. ఇమ్రాన్ ఖాన్, బిలావల్ X ఖాతాలను బ్లాక్ చేసిన భారత్!

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, పాకిస్తానీ పౌరులు, పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లు, అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆంక్షలు విధించింది. తాజాగా పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ X ఖాతాలను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది.

నోరుజారుతున్న పాకిస్థానీయులు.. ఇమ్రాన్ ఖాన్, బిలావల్ X ఖాతాలను బ్లాక్ చేసిన భారత్!
Imran Khan,Bilawal Bhutto Zardari

Updated on: May 04, 2025 | 1:15 PM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుండి పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకుంటోంది. మొదట, భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తానీయులపై, తరువాత భారతదేశంలో పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేయడంతోపాటు, భారతదేశంలో అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, పాకిస్తానీ వెబ్‌సైట్‌లు నిషేధించింది కేంద్రం. ఈ ఎపిసోడ్‌లో మరోసారి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ X ఖాతాను నిషేధించింది.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సోషల్ మీడియా ఖాతాలను భారతదేశంలో బ్లాక్ చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత వ్యతిరేక కార్యకలాపాలు, ప్రకటనలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు.

అంతకు ముందే, భారతదేశంలో అనేక మంది పాకిస్తానీ ప్రముఖుల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో హనియా అమీర్, మహీరా ఖాన్ సహా అనేక మంది పాకిస్తానీ నటుల ఖాతాలు కూడా ఉన్నాయి. పాకిస్తానీయులు నిరంతరం చేస్తున్న ప్రకటనల కారణంగా భారత ప్రభుత్వం ఈ చర్య పూనుకుంటోంది.

పాకిస్తాన్ సమాచార, ప్రసార మంత్రి అతుల్లా తరార్ ‘X’ ఖాతాను కూడా నిషేధించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన 24 నుంచి 36 గంటల్లోపు న్యూఢిల్లీ పొరుగు దేశంపై సైనిక దాడి ప్రారంభించవచ్చని ఇస్లామాబాద్‌కు విశ్వసనీయ నిఘా సమాచారం ఉందని ఒక రోజు ముందు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న అతుల్లా తరార్ ఖాతాపై నిషేధం విధించారు.

ఈ క్రమంలోనే పాకిస్తాన్‌కు చెందిన దాదాపు 16 యూట్యూబ్ ఛానెల్‌లను భారతదేశం నిషేధించింది. హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు తర్వాత ఈ చర్య తీసుకోవడం జరిగింది. దేశంలో సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేసిన ఆటగాళ్లలో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది, షోయబ్ మాలిక్, షోయబ్ అక్తర్ సహా అనేక మంది ఉన్నారు.

అంతకుముందు, ఉగ్రదాడి తర్వాత, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, బాసిత్ అలీ, షోయబ్ అక్తర్ ల యూట్యూబ్ ఛానెల్‌లను కూడా భారతదేశంలో నిషేధించారు. పాకిస్తాన్ నుండి నిషేధించిన ఇతర YouTube ఛానెల్‌ల జాబితాలో డాన్ న్యూస్, సమా టీవీ, ARY న్యూస్, బోల్ న్యూస్, జియో న్యూస్ వంటి ప్రముఖ పేర్లు ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..