Sunil Bansal: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సాల్.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు

|

Aug 10, 2022 | 7:29 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవచ్చని కమలం పార్టీ

Sunil Bansal: తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా సునీల్ బన్సాల్.. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు
Sunil Bansal
Follow us on

Sunil Bansal: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలవచ్చని కమలం పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీని వరుసగా రెండుసార్లు అధికార పీఠానికి తీసుకురావడంలో సునీల్ బన్సాల్ కీలకంగా వ్యవహరించారు. రాజస్థాన్ లోని జయపూర్ సమీపంలోని కొట్ పుట్లీ బన్సాల్ స్వస్థలం, బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) లో స్వయం సేవక్ అయిన సునీల్ బన్సాల్ విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు(ఏబీవీపీ)లో పనిచేశారు. 1989లో రాజస్థాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో గెలిచారు. విశ్వవిద్యాలయ విద్య పూర్తికాగానే ఆర్ ఎస్ ఎస్ లో ప్రచారక్ గా జీవితాన్ని ప్రారంభించారు. ఆతర్వాత ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పలు రాష్ట్రాల్లో ఏబీవీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ ప్రారంభించిన యూత్ ఎగెనెస్ట్ కరెప్షన్(YAC) ఉద్యమానికి నేషనల్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. నాలుగేళ్లపాటు YAC కన్వీనర్ గా దేశ వ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు చేశారు. కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా మోదీవైపు యువతను ఆకర్షించడంలో ఈసంస్థ కీలకంగా వ్యవహరించింది. ఆసమయంలోనే సునీల్ బన్సాల్ నాయకత్వ లక్షణాలను బీజేపీ నాయకత్వం గుర్తించింది. దీంతో సునీల్ బన్సాల్ ను బీజేపీకి ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం కోరింది. దీంతో సునీల్ బన్సాల్ కు అమిత్ షా ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.

మూడేళ్ల పాటు యూపీలోనే మకాం వేసిన బన్సాల్.. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు ప్రధాన కారణమయ్యాడు. యూపీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సునీల్ బన్సాల్ ఎవరనే చర్చ సాగింది. 2017 ఎన్నికల్లో విజయం తర్వాత బీజేపీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2022 ఎన్నికల్లోనూ యూపీలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడానికి యోగీ ఆదిత్యనాథ్ పాలనతో పాటు.. సునీల్ బన్సాల్ వ్యూహాలు పనిచేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. మొన్నటి వరకు తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి శ్రీనివాస్ ను పంజాబ్ కు కేటాయించింది. అప్పటినుంచి సునీల్ బన్సాల్ ను తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారనే చర్చ సాగింది.

అమిత్ షాకు సన్నిహితుడు కావడంతో అనూహ్యాంగా సునీల్ బన్సాల్ ను బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ.. ఆయనను పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా రాష్ట్ర ఇన్ ఛార్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. బెంగాల్ , ఒడిశాలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటంతో పాటు, తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో సునీల్ బన్సాల్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బ్రహ్మచారి అయిన సునీల్ బన్సాల్ తనకు అప్పగించిన ఏ పనినైనా నిష్టతో..చేస్తారనే పేరుంది. అందుకే తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ సునీల్ బన్సాల్ ను తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జిగా నియమించిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఉండగా జార్ఖండ్ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న ధర్మపాల్ కు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..