
బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావించి మనం క్రమం తప్పకుండా తింటుంటాం. కానీ మార్కెట్లో లభించే కల్తీ, రసాయనాలతో కూడిన బెల్లం తినడం వల్ల ప్రయోజనాలకు బదులు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. బెల్లానికి మెరుపు తేవడానికి కలిపే సోడియం హైడ్రోసల్ఫైట్ వంటి కెమికల్స్ కడుపులోకి వెళ్లడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, కడుపులో మంట, అల్సర్లకు దారితీస్తుంది. బెల్లంలోని ప్రమాదకర రసాయనాలను శరీరం నుండి బయటకు పంపే క్రమంలో మూత్రపిండాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఇది దీర్ఘకాలంలో కిడ్నీ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కృత్రిమ రంగులు, రసాయనాలు రక్తం ద్వారా శరీరమంతటా వ్యాపించి చర్మంపై దద్దుర్లు, దురద, అలర్జీలు, మొటిమలకు కారణమవుతాయి.
తెల్లగా లేదా లేత పసుపు రంగులో మెరిసిపోయే బెల్లంలో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. శుద్ధమైన, సహజమైన బెల్లం ఎల్లప్పుడూ ముదురు గోధుమ రంగు లేదా కాస్త నలుపు షేడ్లో ఉంటుంది. బెల్లం ముక్కను నోట్లో వేసుకున్నప్పుడు కేవలం తీపి మాత్రమే ఉంటే అది మంచి బెల్లం. ఒకవేళ కాస్త ఉప్పగా లేదా చేదుగా అనిపిస్తే అందులో రసాయనాలు లేదా అధికంగా ఉప్పు కలిపారని అర్థం.
ఒక గ్లాసు నీటిలో చిన్న బెల్లం ముక్కను వేయండి. అది కరిగిన తర్వాత గ్లాసు అడుగున తెల్లటి పదార్థం లేదా రసాయనాల అవశేషాలు కనిపిస్తే అది కల్తీ బెల్లం. కల్తీ బెల్లం గట్టిగా, స్పటికంలా మెరుస్తుంది. సహజమైన బెల్లం కాస్త మెత్తగా, చేతితో ఒత్తితే నలిగిపోయేలా ఉంటుంది. ఆరోగ్యం కోసం బెల్లం కొనుగోలు చేసేటప్పుడు ఆకర్షణీయమైన రంగు కంటే, దానికి ఉన్న సహజమైన రూపాన్ని బట్టి ఎంచుకోవడం అత్యంత ముఖ్యం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..