హెచ్ఐవీ అనేది ఎంత ప్రాణాంతకమైన వ్యాధో అందరికి తెలిసింది. దీన్ని పూర్తిగా నయం చేయగలిగే మెడిసిన్ను ఇంకా కనిపెట్టలేదు. ఈ డిసీజ్తో సఫర్ అయ్యేవాళ్లు బయటకు చెప్పుకోడానికి ఇబ్బంది పడతారు. ప్రపంచం చిన్న చూపు చూస్తుందని..వెలి వేస్తుందని వారి భయం. అందుకే వారిలో వారే మదనపడుతూ ఉంటారు.
అయితే తనకు హెచ్ఐవీ ఉందని వేల్స్కు చెందిన రగ్బీ జట్టు మాజీ కెప్టెన్ గారెత్ థామస్ ప్రకటించాడు. చాలా ఏళ్ల పాటు ఈ విషయాన్ని తనలోనే దాగి ఉంచుకున్నానని తెలిపాడు. 45 ఏళ్ల థామస్ 1995 నుంచి 2007 వరకు వేల్స్ రగ్బీ జట్టు తరఫున 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. ఈ విషయంపై తనకు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయని, అందుకే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని పేర్కొన్నాడు. ట్విటర్లో పోస్టు చేసిన వీడియోలో అతడు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. హెచ్ఐవీ ఉన్నందున తనను సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని, ఈ సందర్భంగా అండగా అతడు కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తనకు సోకిన వ్యాధి పట్ల నిరంతరం పోరాటం చేస్తానని, హెచ్ఐవీపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తానని థామస్ వివరించాడు. ప్రజలు తన గురించి ఏమనుకుంటారోననే ఇన్నేళ్లు ఈ రహస్యాన్ని బయటపెట్టలేదని, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని వెల్లడించాడు. ఇదిలా ఉండగా వేల్స్ జట్టు మరోవారంలో తొలిసారి రగ్బీ ప్రపంచకప్లో ఆడే సమయంలో థామస్ ఈ విషయాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అతడు పోస్టు చేసిన వీడియోకి పలువురు నుంచి ప్రశంసలతో పాటు అభినందనలు అందుతుండటం విశేషం. గ్రౌండ్లోనే కాదు నీవు బయట కూడా లెజెండే అంటూ థామస్కు నెటిజన్లు ధైర్యం చెప్తున్నారు.