కరోనాకు ఖరీదైన ప్లాస్మా థెరపి..కేరళకు అనుమతి: ఐసీఎంఆర్
కరోనా నివారణకు అమెరికా, చైనా దేశాల్లో ప్లాస్మా థెరిపిని వాడుతున్నారు.. అది సత్ఫలితాలు ఇస్తున్నట్లు వైద్యు లు ప్రకటించారు. భారత్లోనూ ..
కోవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అహర్నిషలు పరిశోధనలు చేస్తున్నారు. ఇంతవరకు ఈ వైరస్ నివారణకు ఖచ్చితమైన వ్యాక్సిన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఇంకా ఈ మందు ప్రయోగ దశలోనే ఉంది. ఇప్పటి వరకూ కరోనా నివారణకు హెచ్ఐవీ మందులు, యాంటీ మలేరియా డ్రగ్- హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందులను వినియోగిస్తున్నారు.
కాగా, కరోనా నివారణకు అమెరికా, చైనా దేశాల్లో ప్లాస్మా థెరిపిని వాడుతున్నారు.. అది సత్ఫలితాలు ఇస్తున్నట్లు వైద్యు లు ప్రకటించారు. భారత్లోనూ కరోనా విలయ తాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశంలోనూ ప్లాస్మా థెరిపికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతిచ్చింది. కేరళ రాష్ట్రానికి తాజాగా అనుమతులు జారీ చేయడంతో అక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా ఎమర్జెన్సీ పేషెంట్లకు ప్లాస్మా థెరపీ విధానంతో చికిత్స చేయనున్నారు.
ప్లాస్మా థెరపీలో కరోనా సోకి కోలుకున్న వ్యక్తి శరీరం నుంచి రక్తాన్ని సేకరించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగి రక్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధారణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్రమంలో కరోనా వచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఈ విధానం ద్వారా రోగులను బతికించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అగ్ర రాజ్యం అమెరికాతో పాటు చైనాలో సక్సెస్ కావడంతో కరోనా అధికంగా ఉన్న ఇటలీ, స్పెయిన్, జర్మనీ, బ్రిటన్ లలో కూడా ప్లాస్మా ధెరపికి వైద్యులు మొగ్గు చూపుతున్నారు. కరోనాని జయించిన రోగిలో కరోనా వైరస్ ను అంతం చేసే రోగ నిరోధక శక్తి ప్లాస్మాలో ఉంటుందని వైద్యులు దృవీకరించడంతో వైద్య రంగం ఈ ప్రక్రియను వినియోగంలోకి తేనున్నారు..
ఇక కరోనా ను జయించిన రోగి నుంచి సేకరించే ప్లాస్మాతో రెండు డోసులు మాత్రమే తయారు చేయవచ్చని ఐసిఎంఆర్ తెలియజేసింది. ఒక డోసు వ్యక్తికి సరిపోతుందని అయితే ప్లాస్మాను సేకరించేందుకు కరోనా సోకి కోలుకున్న వ్యక్తిని ఒప్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఇక అమెరికా, చైనాలలో ఇప్పటికే ఈ విధానం సక్సెస్ అయినందున.. మన దేశంలోనూ దీన్ని ప్రస్తుతం ప్రారంభించారు. అయితే ఈ విధానం చాలా ఖర్చుతో కూడుకున్నది కనుక.. కేవలం అత్యవసర స్థితి ఉన్న కరోనా పేషెంట్లకు మాత్రమే ఈ విధానంలో చికిత్స చేయనున్నారు. అయితే ఫ్లాస్మా థెరపీ కోసం అనుమతి పొందినప్పటికీ, డ్రగ్ కంట్రోలర్స్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా ఆమోదం లభించలేదు.
ఎవరైనా కరోనా సోకి కోలుకున్న వ్యక్తి అంగీకరిస్తే, తాము యాంటీబాడీ లెవల్స్ కోసం పరీక్ష చేయవచ్చని కేరళలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ అనూప్ కుమార్ తెలిపారు. ఇది రక్తదానం లాంటిది కాదని, కేవలం శరీరంలో నుంచి ఫ్లాస్మా మాత్రమే సేకరించబడుతుందని చెప్పారు. 55కేజీల బరువు ఉన్న వ్యక్తి రక్తంలో తగినంత ప్రొటీన్ ఉంటే 800 ఎంఎల్ ఫ్లాస్మా దానం చేయవచ్చని సూచించారు.. దీంతో నలుగురు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయవచ్చని చెప్పారు. ఒక్కో పేషెంట్ కు 200 ఎం ఎల్ ఫ్లాస్మా అవసరమవుతుందని ఆయన తెలిపారు. ఈ ప్లాస్మా థెరిపి చాలా ఖరీదైన చికిత్స అని, అందుకే వెంటి లేటర్ పై చికిత్స పొందుతున్న వారికి మాత్రమే ఈ ప్రక్రియతో నయం చేయాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది.