భారత్, రష్యా, చైనాల్లో వాయు కాలుష్యం తీవ్రత ఎక్కవ: ట్రంప్
అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి బైడెన్తో జరిగిన రెండవ డిబేట్లో ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, రష్యా దేశాల్లో వాయు కాలుష్యం అత్యంత మురికిగా ఉన్నట్లు ట్రంప్ కామెంట్ చేశారు.
అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ప్రత్యర్థి బైడెన్తో జరిగిన రెండవ డిబేట్లో ప్రస్తుత అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, రష్యా దేశాల్లో వాయు కాలుష్యం అత్యంత మురికిగా ఉన్నట్లు ట్రంప్ కామెంట్ చేశారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి తప్పుకోవడానికి కారణాలు వెల్లడించిన ట్రంప్.. తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. చైనా దేశం కాలుష్యంతో నిండిపోయిందన్నారు. అటు రష్యా, ఇండియా దేశాల్లో వాయు కాలుష్యంతో పూర్తిగా నిండిపోయిందని ట్రంప్ ఆరోపించారు. అందుకే పారిస్ ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు వివరించారు. పారిస్ ఒప్పందానికి కట్టుబడి.. మిలియన్ల సంఖ్యలో ఉద్యోగాలను పణంగా పెట్టలేమని, వేలాది కంపెనీలను మూసివేసే పరిస్థితి రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
వాతావరణ మార్పుల అంశంలో భారత్, చైనా లాంటి దేశాలు ఎటువంటి సహకారం అందించలేదని ట్రంప్ పేర్కొన్నారు. కార్బన్డైయాక్సైడ్ విడుదల చేస్తున్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో ఉందన్న ట్రంప్.. 2017లో భారత కార్బన్ ఎమిషన్స్ 7 శాతంగా పెరగిందన్నారు. 2015లో పారిస్ ఒప్పందాన్ని రూపొందించారు. గ్లోబల్ వార్మింగ్ను రెండు డిగ్రీల సెల్సియస్ తగ్గించేందుకు ఆ ఒప్పందాన్ని రూపొందించారు. దీనికి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎంతో కృష్టి చేశారు. అయితే, 2017లో ఆ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
డిబేట్ సందర్భంగా భారత దేశంలో ఉన్న వాయు నాణ్యతపై ట్రంప్ చేసిన కామెంట్ పట్ల ట్విట్టర్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఈ అంశంపై ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ స్నేహితుడు ట్రంప్ భారత్ గురించి ఎటువంటి ప్రకటన చేశారో అర్థం చేసుకోవాలన్నారు. ఇండియాలో కోవిడ్ మరణాలను ప్రశ్నించారని, భారతలో వాయు కాలుష్యం ఎక్కువే అన్నారని, ఇండియా పన్నులు కూడా ఎక్కువే వసూల్ చేస్తుందని ట్రంప్ చేసిన కామెంట్లను కపిల్ సిబల్ తప్పుపట్టారు.