
తమిళ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల్లో జయం రవికి ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆయన భార్య ఆర్తి కోరిన నెలకు రూ.40 లక్షల తాత్కాలిక భరణం డిమాండ్ను కోర్టు తిరస్కరించింది. అయితే విడాకుల కేసు తుది తీర్పు వచ్చే వరకు నెలకు రూ.3 లక్షలు మాత్రమే భరణంగా చెల్లించాలని ఆదేశించింది. భరణం అంశంతో పాటు మరో కీలక విషయంపై కూడా కోర్టు జయం రవికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తన ఇద్దరు కుమారులను ఎలాంటి ఆంక్షలు లేకుండా కలిసే హక్కు ఆయనకు ఉందని స్పష్టం చేసింది. దీంతో పిల్లలను కలిసేందుకు ఉన్న అడ్డంకులు తొలగినట్లు అయింది.
జయం రవి, ఆర్తి మధ్య విడాకుల వ్యవహారం గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భరణం, పిల్లల సంరక్షణ తదితర అంశాలపై ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించాయి. తాజా మధ్యంతర ఉత్తర్వులతో జయం రవికి కొంత ఊరట లభించినప్పటికీ, విడాకుల కేసుపై తుది తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. తదుపరి విచారణల్లో మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. తాజా పరిణామంతో జయం రవికి ఆర్థిక పరంగా కొంత ఉపశమనం లభించినట్లుగా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారీ మొత్తంలో భరణం చెల్లించాల్సి వస్తే అది ఆయనపై గణనీయమైన ఆర్థిక భారం అయ్యేదని అభిప్రాయపడుతున్నారు. కోర్టు తాజా ఉత్తర్వులతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా హీరో జయం రవి, ఆర్తి విడాకుల వ్యవహారం ప్రకటించినప్పటి నుంచి ఈ కేసు నెట్టింట హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య పరస్పర ఆరోపణలు, లీగల్ ప్రక్రియలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ప్రచారాలు సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. పైగా గాయని కెనీషా ఫ్రాన్సిస్ పేరు కూడా వీరి కేసు విషయంలో చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం విడాకుల కేసు విచారణలో ఉండటంతో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.