
మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వం, ఆయన నటన, సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. చిరంజీవి పేరులోనే ఒక మ్యాజిక్, ఒక మ్యూజిక్ ఉందని, ఆ పేరులోని శాశ్వతత్వం గొప్పదని ఆయన అన్నారు. చిరంజీవి తన పేరు ఎలా వచ్చిందో భరణికి చెప్పిన వృత్తాంతాన్ని వివరించారు. శివశంకర వరప్రసాద్ అనే అసలు పేరున్న చిరంజీవికి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన పేరును మార్చుకునే ఆలోచన వచ్చిందట. ఆ సమయంలో ఒక కల వచ్చిందని, అందులో ఎవరో తనను చిరంజీవి అని పిలిచినట్టు అనిపించిందని, ఆంజనేయ స్వామి భక్తుడిగా చిరంజీవులు లిస్టులో ఆంజనేయ స్వామి కూడా ఉన్నందున, శాశ్వతత్వం అనే అర్థం వచ్చే ఈ పేరును తల్లిదండ్రుల సలహా మేరకు పెట్టుకున్నారని భరణి తెలిపారు. తనికెళ్ళ భరణి, చిరంజీవితో తన తొలి స్క్రీన్ షేరింగ్ అనుభవాన్ని జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రం ద్వారా గుర్తు చేసుకున్నారు.
చెన్నైలో రాళ్ళపల్లి ఇంట్లో ఉంటున్నప్పుడు, అప్పటికే రచయితగా, అప్పుడప్పుడు చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉన్న భరణికి, ఊటీలో జరుగుతున్న జగదేకవీరుడు అతిలోకసుందరి షూటింగ్కు పిలుపు వచ్చిందని పేర్కొన్నారు. ఆ సినిమాలో తనకొక ఫైట్ సీన్ ఉందని, అందులో హాకీ స్టిక్తో చిరంజీవిని కొట్టాల్సి వచ్చిందని వివరించారు. రిహార్సల్ సమయంలో డమ్మీ హాకీ స్టిక్ విరిగిపోగా, అసలు స్టిక్ను తనకు ఇచ్చారని, దాంతో చిరంజీవి లాంటి హీరోను కొట్టాల్సి వస్తుందనే టెన్షన్తో వణుకుతున్నానని భరణి అన్నారు. ఈ టెన్షన్ను అశ్వినీదత్ గారు గమనించి, “ఏమన్నా తగిలినా షెడ్యూల్ దెబ్బ తింటుంది” అని చెప్పడంతో భయం మరింత పెరిగిందని చెప్పారు. అయితే, చిరంజీవి టైమింగ్, ఆయన సాంకేతిక పరిజ్ఞానం గొప్పదని, తను కొట్టిన ప్రతిసారీ ఆయన సరైన సమయంలో తల దించుకోవడం వల్ల దెబ్బ తగలకుండా సీన్ పూర్తయిందని భరణి ప్రశంసించారు. ఆ సంఘటన చిరంజీవికి తెలియదన్నారు, అది ఆయన గొప్పదనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు ఉన్నా కూడా ఆ చిత్రం ఘన విజయం సాధించిందని, హైదరాబాద్లో ఒక పెద్ద 100 రోజుల వేడుకను జరుపుకున్నామని భరణి గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాత బిగ్ బాస్ చిత్రంలో చిరంజీవి దర్శకత్వంలో నటించిన అనుభవాన్ని తనికెళ్ళ భరణి పంచుకున్నారు. దర్శకుడు బాపినీడు గారు అత్యవసర పని నిమిత్తం అందుబాటులో లేనప్పుడు, మూడు రోజుల పాటు సాగే కీలకమైన ఫైట్ సన్నివేశాలకు చిరంజీవి స్వయంగా దర్శకత్వం వహించారని ఆయన తెలిపారు. కథ ప్రకారం, క్రూరమైన ఎస్.ఐ. యాదగిరి పాత్రలో ఉన్న భరణి, హీరోను రెచ్చగొట్టడం కోసం కొన్ని అమానుష చర్యలు చేస్తాడు. ఆ సన్నివేశంలో చిరంజీవి మాల వేసుకుని అయ్యప్ప దీక్షలో ఉంటాడు. చిరంజీవిని కొట్టినప్పుడు, ఆయన మెడలోని మాల ఎగిరి పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి బొమ్మల మీద పడుతుందని, ఇది దైవికంగా చిరంజీవిని “వాడిని చితకకొట్టేయ్” అని సూచించినట్లు ప్రేక్షకులకు అనిపిస్తుందని భరణి వివరించారు. ఈ మూడు రోజుల పాటు సాగిన పోరాట సన్నివేశాల దర్శకత్వం చిరంజీవి అద్భుతంగా నిర్వహించారని, ఒక హాలీవుడ్ సినిమాను తలపించేలా ఆ సీక్వెన్స్ ఉంటుందని భరణి ప్రశంసించారు.
ఎక్కువమంది చదివినవి : Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేశా.. హీరోయిన్ ఆమని..