కరోనా కాటుకు ఏలూరు ఫ్రంట్ వారియర్ బలి
కరోనా బాధితులకు అవిశ్రాంతంగా సేవలందించిన ఫ్రంట్ వారియర్స్ సైతం కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో యోగేంద్రబాబు(59) గురువారం కన్నుమూశారు.
కరోనా బాధితులకు అవిశ్రాంతంగా సేవలందించిన ఫ్రంట్ వారియర్స్ సైతం కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంవో యోగేంద్రబాబు(59) గురువారం కన్నుమూశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు డయాలసిస్ తో పాటు షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ కరోనా కష్టకాలంలో ఎలాంటి సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో 15రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం యోగేంద్రబాబు తుది శ్వాస విడిచారు. జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్ కె.శంకరరావు, పర్యవేక్షకులు డాక్టర్ బి.రవికుమార్తో పాటు పలువురు వైద్యులు యోగేంద్ర బాబుకు ఘనంగా నివాళులర్పించారు.
యోగేంద్ర బాబు 30ఏళ్లుగా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సేవలందిస్తూ పేదల డాక్టర్గా గుర్తింపు పొందారు. ఆయన తండ్రి డాక్టర్ పరాత్పరరావు కూడా ప్రముఖ వైద్యులే. యోగేంద్ర బాబు గోల్డెన్ అవర్లోనే కీలకమైన వైద్య సేవలు అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడిన పేరు సంపాదించుకున్నారు. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. గతంలో ఐఎంఏ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఏలూరు నగరంలో ఉన్న సీఆర్ఆర్ విద్యా సంస్థలకు గెస్ట్ ఫ్యాకల్టీగా వ్యవహరిస్తున్నారు. ఎందరో పేద రోగులకు ప్రాణదాతగా నిలిచిన యోగేంద్రబాబు చనిపోవడం పట్ల ఏలూరు వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.