నాగర్‌కర్నూలు జిల్లాలో అలస్యంగా వెలుగుచూసిన దారుణం.. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై మైనర్ బాలుర సామూహిక అత్యాచారం

మద్యం సేవించిన నలుగురు బాలురు.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నాగర్‌కర్నూలు జిల్లాలో అలస్యంగా వెలుగుచూసిన దారుణం.. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై మైనర్ బాలుర సామూహిక అత్యాచారం
Follow us

|

Updated on: Jan 04, 2021 | 5:30 PM

Minor girls gang raped: ప్రభుత్వ చట్టాలు పిల్లలను కూడా బయపెట్టలేకపోతున్నాయి. అభం శుభం తెలియని ఇద్దరు మైనర్ బాలికలను మైనర్లలే అఘాయిత్యానికి పాల్పడ్డారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం సేవించిన నలుగురు బాలురు.. ఇద్దరు అక్కాచెల్లెళ్లను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని లింగాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. డిసెంబరు 31 వేడుకల్లో భాగంగా 14 నుంచి 16 ఏళ్ల వయసు కలిగిన నలుగురు బాలురు పీకల దాకా మద్యం తాగారు. అర్ధరాత్రి ఆ గ్రామంలోని ఓ వితంతువు ఇంటికి వెళ్లారు. ఆమెను భయపెట్టి ఇద్దరు కుమార్తెలపై అఘాయిత్యానికి తెగబడ్డారు. అంతేకాకుండా ఆ దురాగతాన్ని సెల్‌ఫోన్లలో చిత్రీకరించి విషయం బయటికి చెప్పవద్దని హెచ్చరించారు.

అయితే, ఈ దారుణంపై పోలీసులకు చెప్పేందుకు బాధిత కుటుంబం భయంతో వణికిపోయింది. నిందితులు తమ వద్ద వీడియోలు ఉన్నాయని భయపెట్టడంతో ఆ నిరుపేద కుటుంబం ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. కాగా, గ్రామంలో కొందరు వ్యక్తులు పంచాయితీ పెట్టి నిందితుల నుంచి పరిహారం ఇప్పించేలా ఒప్పందం కుదిర్చినట్లు సమాచారం. ఈ విషయమై స్థానిక పోలీసులను సంప్రదించగా లైంగిక దాడికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. పెద్ద మనుషుల ముసుగులో తప్పును కప్పిపుచ్చేందుకు గ్రామపెద్దలు ప్రయత్నిస్తున్నారని మహిళా సంఘాలు ఆరోపించాయి. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.