
Mukesh Ambani: ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అయిన ముఖేష్ అంబానీ ఈ ఏడాది తన కంపెనీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ముఖేష్ అంబానీ జీతంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం ఇది వరుసగా ఆరో సంవత్సరం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ జీతం, అలవెన్సులు, సౌకర్యాలు, పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో ఎలాంటి మొత్తాన్ని స్వీకరించలేదు. ముఖేష్ అంబానీకి డివిడెండ్లే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి.
గతంలో ముఖేష్ అంబానీ 2008-09 ఆర్థిక సంవత్సరం నుండి 2019-20 వరకు తన వార్షిక పారితోషికాన్ని రూ. 15 కోట్లకు పరిమితం చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆయన జీతం తీసుకోలేదు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ, కంపెనీ, దాని మొత్తం వ్యాపారం పూర్తి ఆదాయ సామర్థ్యానికి తిరిగి వచ్చే వరకు జీతం తీసుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వచ్ఛందంగా తీసుకున్నారట. అలాగే ఇది 2021-22, 2022-23, 2023-24, 2024-25, ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరాలలో కూడా కొనసాగుతుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 95,754 కోట్ల అత్యధిక లాభాన్ని ఆర్జించింది. అలాగే కంపెనీ మార్కెట్ విలువ రూ.18.19 లక్షల కోట్లుగా నిలిచింది.
సుమారు 100 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలో 21వ అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ, డివిడెండ్ల ద్వారా సంపాదిస్తున్నారు. రిలయన్స్లో ఆయనకు నేరుగా ఉన్న 1.61 కోట్ల షేర్ల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్ ఆధారంగా ఆయనకు రూ.9.66 కోట్ల డివిడెండ్ ఆదాయం లభించింది. అంబానీ కజిన్స్ అయిన నిఖిల్, హితల్ మెస్వానీల పారితోషికం చెరో రూ.25 కోట్లుగా స్థిరంగా ఉంది. ఇందులో జీతం, అలవెన్సులు, పదవీ విరమణ ప్రయోజనాలు, లాభాల కమీషన్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.ఎం.ఎస్. ప్రసాద్ పారితోషికం 2024-25లో రూ.19.96 కోట్ల నుండి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.20.58 కోట్లకు పెరిగింది.
ఇది కూడా చదవండి: RBI: పెద్ద నోట్ల రద్దు తర్వాత 10 ఏళ్లకు ఆర్బీఐ మరో కీలక మార్పుకు సన్నాహాలు
అంబానీ ముగ్గురు పిల్లలు, ఇషా, ఆకాష్, అనంత్, అక్టోబర్ 2023లో డైరెక్టర్ల బోర్డులోకి ప్రవేశించారు. అయితే దీనికి గాను వారికి ఎలాంటి జీతం చెల్లించలేదు. వారికి కేవలం సమావేశ రుసుములు, లాభాలపై కమీషన్ మాత్రమే చెల్లించారు. ఆకాష్, ఇషా రూ. 2.5 కోట్ల కమీషన్ అందుకున్నారు. అంబానీ 1977 నుండి రిలయన్స్ డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు. జూలై 2002లో గ్రూప్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం ఆయనను కంపెనీ ఛైర్మన్గా నియమించారు. 2023 సంవత్సరంలో ఏప్రిల్ 2029 వరకు ఐదేళ్ల కాలానికి ఆయనను రిలయన్స్ అధిపతిగా తిరిగి నియమించారు. ఈ కాలంలో కూడా ఆయన జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.
ఇది కూడా చదవండి: Washing Machine: వాషింగ్ మెషీన్లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్ లోడ్ అయితే ఏమవుతుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి