
2019లో కొనుగోలు చేసిన ఒక డీజిల్ ఆటోమేటిక్ కారు యజమానికి ఎదురైన సాంకేతిక సమస్యలు చివరకు న్యాయ పరిష్కారానికి దారి తీశాయి. వాహనం కొనుగోలు చేసిన 34 నెలల్లోపే విద్యుత్ సంబంధిత లోపాలు తలెత్తి, బ్యాటరీ పదేపదే డిశ్చార్జ్ అవుతూ కారు స్టార్ట్ కాకుండా పోయింది. దీంతో యజమాని పలుమార్లు సర్వీస్ సెంటర్ను ఆశ్రయించాల్సి వచ్చింది. సర్వీస్ బృందం సమస్యను పరిష్కరించేందుకు బ్యాటరీని మొత్తం 67 సార్లు మార్చడం సహా పలు ఎలక్ట్రానిక్ భాగాలను కూడా మార్చింది. సమస్య మూలాన్ని గుర్తించేందుకు డేటా లాగర్ను అమర్చినా, దీర్ఘకాలిక పరిష్కారం కనుగొనడంలో విఫలమయ్యారు.
అయితే కారు తయారీ సంస్థ ఈ సమస్యను తయారీ లోపంగా అంగీకరించలేదు. వినియోగదారుడు సాంకేతిక ఆధారాలు సమర్పించలేదని, అలాగే కారు సుమారు 15,000 కిలోమీటర్లు నడిచిందని పేర్కొంటూ తమ వాదనను సమర్థించుకుంది. ఈ నేపథ్యంలో కేసును విచారించిన చండీగఢ్ వినియోగదారుల కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. తయారీ లోపం నిరూపించబడకపోయినా, ఒకే సమస్య వారంటీ కాలంలో పదేపదే తలెత్తడం సేవా లోపంగా పరిగణించబడుతుందని కమిషన్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితి వినియోగదారునికి మానసిక వేదనతో పాటు గణనీయమైన అసౌకర్యాన్ని కలిగించిందని కూడా పేర్కొంది.
దీంతో కారు కంపెనీ, సంబంధిత సర్వీస్ సెంటర్ 45 రోజులలోగా యజమానికి రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. గడువు లోపు చెల్లించకపోతే సంవత్సరానికి 9 శాతం వడ్డీ కూడా వర్తిస్తుందని తెలిపింది. ఈ తీర్పు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తోంది. తయారీ లోపం నిరూపించలేకపోయినా, నిరంతరం ఎదురయ్యే సమస్యలపై వినియోగదారులు న్యాయం పొందగలరని ఇది స్పష్టం చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి