
ప్రభుత్వ ఆరోగ్య భద్రత పథకం అయిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PM-JAY) కింద అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందించబడుతోంది. ఈ ప్రయోజనాలను పొందడానికి అవసరమైన ఆయుష్మాన్ కార్డు పొందడం ఇప్పుడు పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారింది. దీంతో ప్రజలు ఇంటి నుంచే మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకుని, కార్డును డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం లభిస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారులు ఆయుష్మాన్ యాప్, అధికారిక PM-JAY వెబ్సైట్ లేదా UMANG యాప్ ద్వారా తమ కార్డును పొందవచ్చు.
ఆధార్ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేసి, OTP ధృవీకరణ పూర్తిచేసిన తర్వాత PDF రూపంలో కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్న వారికి ఈ ప్రక్రియ మరింత సులభతరం అయింది. రేషన్ కార్డులో పేరు ఉంటే, చాలా రాష్ట్రాల్లో అదే ప్రధాన అర్హతగా పరిగణిస్తూ 24 గంటల్లోపు కార్డు జారీ చేస్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు కోసం అధికారిక పోర్టల్లో మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయి, రాష్ట్రం, జిల్లా వివరాలు ఎంచుకుని, ఆధార్ ద్వారా పేరు శోధించాలి. అనంతరం ఫోటో అప్లోడ్ చేసి, అవసరమైన వివరాలు సమర్పిస్తే ధృవీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. దరఖాస్తు స్థితిని 24 గంటల తర్వాత పరిశీలించవచ్చు. అలాగే గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న ఆయుష్మాన్ భారత్ యాప్ ద్వారా కూడా ఇదే విధంగా దరఖాస్తు చేయవచ్చు.
ఈ పథకం కింద ఆసుపత్రి చికిత్స, మందులు, పరీక్షలు, ఐసియు సేవలు, డిశ్చార్జ్ తర్వాత 15 రోజుల ఫాలో-అప్ వరకు మొత్తం రూ.5 లక్షల కవరేజీ అందుతుంది. ముఖ్యంగా 70 సంవత్సరాలు పైబడిన పౌరులందరికీ ఆదాయ పరిమితి లేకుండా అర్హత కల్పించడం గమనార్హం. అలాగే ఇప్పటికే CGHS లేదా ECHS వంటి పథకాల కింద ఉన్నవారికి కూడా ఈ పథకాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. డిజిటల్ విధానం ద్వారా ఆయుష్మాన్ కార్డు పొందడం మరింత వేగవంతంగా, పారదర్శకంగా మారింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఆరోగ్య సేవలను సులభంగా పొందే అవకాశం పెరిగింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి