దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే ఇంటికి అనుమతి
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే ఇంటికి అన్ని అనుమతులు వచ్చేలా టీఎస్ బీ–పాస్ చట్టం ఉండనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు
Telangana Assembly Session: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే ఇంటికి అన్ని అనుమతులు వచ్చేలా టీఎస్ బీ–పాస్ చట్టం ఉండనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. లేదంటే 22 వ రోజున సంబంధిత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ సంతకంతో కూడిన అనుమతి సర్టిఫికెట్ జారీచేస్తారని పేర్కొన్నారు. దీనిద్వారా బ్యాంకుల్లో లోన్లు కూడా పొందవచ్చని, ఈ సర్టిఫికెట్తో భవన నిర్మాణ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇస్తారని ఆయన చెప్పారు. ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే పది రోజుల్లోనే ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేయనున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్, అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ బీపాస్) బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 75 గజాల లోపు స్థలాల్లో నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు.
భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసేందుకు, ఇందులో పారదర్శకత ఉండటం కోసమే టీఎస్బీపాస్ బిల్లు తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ బిల్లు వలన 95 శాతం పట్టణ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ఈ చట్టం అమలు పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలోనూ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. ప్రభుత్వ స్థలాల్లో ఇతర నిర్మాణాలుంటే, నోటీసు ఇవ్వకుండానే కూల్చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కాగా టీఎస్ బీపాస్కు అసెంబ్లీలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
Read More: