న్యూఢిల్లీ: పాకిస్థాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బరితెగించింది. భారత్లో పుల్వామా ఉగ్రదాడి తరహాలో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మొఖానికి నల్లని ముసుగు కట్టుకుని ఒక ఉగ్రవాది భారత్కు వార్నింగ్ ఇచ్చాడు. అతని మాటలను వీడియో తీసి బయటకు వదిలారు. మొఖానికి నల్ల గుడ్డ కట్టుకుని ఉన్న ఆ ఉగ్రవాది వెనక జైషే మహ్మద్ పేరుతో ఒక బ్యానర్ ఉంది.
అయితే పుల్వామా దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పిన కొద్దిసేపటికే ఈ వీడియో విడుదల కావడం విశేషం. భారత్ తమపై నిందలు వేస్తుందని, ఆధారాలు చూపిస్తే విచారణ జరిపిస్తామని ఇమ్రాన్ చెప్పారు.
అయితే పుల్వామా దాడి తర్వాత కూడా జైషే మహ్మద్ ఒక వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్ల మరణానికి కారణమైన అదిల్ మహ్మద్ మాట్లాడాడు. ఈ వీడియోను మీరు చూసే సరికి తాను స్వర్గంలో ఉంటానని, కశ్మీర్ కోసం పోరాటం కొనసాగాలని అందులో చెప్పాడు. కొంతమందిని చంపినంత మాత్రాన వెనకడుగు వేయమని అతను భారత్కు ఆ వీడియోలో హెచ్చరించాడు.