Somu Veerraju: తెలంగాణ అవసరాలపై కేసీఆర్ దార్శినికతను ప్రశంసించాల్సిందే: ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా వాళ్ళు కలిసి ఉండాలన్న ఆలోచన తప్ప విడిపోతే దక్కించుకోవాల్సిన..
Somu Veerraju – CM KCR: ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా వాళ్ళు కలిసి ఉండాలన్న ఆలోచన తప్ప విడిపోతే దక్కించుకోవాల్సిన అంశాలపై దృష్టి సారించలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. తెలంగాణ మాత్రం విడిపోయాక దక్కించుకోవాల్సిన నీటి వాటాలతో పాటు ఇతర ఆస్తులపై చాలా వ్యహాత్మకంగా వ్యవహరించిందన్నారు.
తెలంగాణా బీజేపీ నేతలు సైతం ఆంధ్ర ప్రాజెక్టుల పట్ల మొదటి నుంచీ వివక్ష చూపుతూనే వచ్చారని, విభజన సమయంలో తెలంగాణా అవసరాలపై స్పష్టంగా వ్యవహరించిన కెసీఆర్ దార్శినికతను ప్రశంసించాల్సిందేనన్నారు సోము.
బీజేపీకి ఓట్లు వేయకపోయినా అభివృద్ధి విషయంలో తమ సహకారం ఎప్పుడూ ఉంటుందన్న సోము వీర్రాజు.. ఓట్ బ్యాంక్ రాజకీయాలకు బీజేపీ దూరం అని మరోసారి పునరుద్ఘాటించారు. ఆదివారం విశాఖపట్నం లో ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టులు- వనరులు, సవాళ్లు పై బీజేపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ నేతలతో పాటు నీటి పారుదల రంగంలో పనిచేసి విశేష అనుభవం గడించిన నిపుణులు అనేక మంది పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర లో నీటి సమృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ రౌండ్ టేబుల్ చర్చించింది.