
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పంపిణీ ప్రతీ నెలా రాష్ట్రవ్యాప్తంగా పండుగలా సాగుతోంది. ఒకటో తేదీ రాగానే అధికారులు తెల్లవారుజామునే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ డబ్బులను చేతిలో పెడుతున్నారు. అయితే, ఈసారి విశాఖపట్నం జిల్లాలో పింఛన్ పంపిణీలో ఒక ఆసక్తికరమైన, నోరూరించే సంఘటన చోటుచేసుకుంది. అవ్వాతాతలకు కేవలం డబ్బులే కాకుండా, వేసవి ప్రత్యేక కానుకగా కలెక్టరే స్వయంగా మామిడిపండ్లను అందజేసి సర్ప్రైజ్ చేశారు.
సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది మామిడిపండ్లు. మ్యాంగో లవర్స్ ఈ సీజన్ అంతా మామిడి రుచిని ఆస్వాదిస్తుంటారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో మామిడిపండ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో నిరుపేదలు, పింఛన్ల మీద ఆధారపడే వృద్ధులు, వితంతువులు ఈ సీజన్లో కనీసం ఒక్క పండు కొని రుచి చూసే పరిస్థితి కూడా ఉండటం లేదు. పేదల ఈ చిన్న కోరికను గమనించిన విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సరికొత్త చొరవ చూపారు.
సోమవారం (జూన్ 02) ఉదయం విశాఖపట్నంలోని జ్ఞానాపురం ప్రాంతంలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వృద్ధులు, వికలాంగులు, వితంతువుల ఇళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో జ్ఞానాపురానికి చెందిన ఒక వితంతు మహిళకు రూ. 4 వేల పింఛను సొమ్మును అందజేశారు. అంతటితో ఆగకుండా, ఆమెకు బ్యాగు నిండా నోరూరించే మామిడి పండ్లను కూడా కలెక్టర్ బహుమతిగా ఇచ్చారు. పింఛను డబ్బులతో పాటు ఊహించని విధంగా మామిడిపండ్లు అందడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కలెక్టర్ చూపిన ఈ ఆప్యాయతకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న పింఛన్ల పంపిణీ క్రతువు గురించి జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా లబ్ధిదారులకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ప్రక్రియను అత్యంత సజావుగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం విధి నిర్వహణే కాకుండా, లబ్ధిదారుల్లో ఆనందం నింపేలా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ చేసిన ఈ ప్రయత్నంపై జిల్లావ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..