
కీసర టోల్ ప్లాజా దగ్గర.. అదొక భయానక దృశ్యం.. ఫ్లైయాష్ ట్యాంకర్ సృష్టించిన బీభత్సం.. ఇప్పటికీ వణుకు పుట్టిస్తున్న సీసీ ఫుటేజ్.. డ్రైవర్ నిర్లక్ష్యమే ఘోరానికి కారణమా?.. స్క్రాప్ మిషన్లో పడ్డట్టు తుక్కుతుక్కయిన బీఎండబ్ల్యు కారు.. అందులో నలిగిపోయి అక్కడికక్కడే చనిపోయిన అడ్వొకేట్ శ్రీనివాస్రావు.. కీసర టోల్ ప్లాజా దగ్గర ప్రమాదం.. కళ్లముందు కదలనంటోంది. సీనియర్ అడ్వొకేట్గా మంచి ప్రొఫెషన్లో ఉన్నారనేగాని, లాయర్ శ్రీనివాసరావు కుటుంబాన్ని మాత్రం ట్రాజెడీల మీద ట్రాజెడీలు వెంటాడాయి. కొవిడ్ టైమ్లో శ్రీనివాసరావు తండ్రి చనిపోయారు. అంతకుముందు, పదేళ్ల కిందట కొడుకు రుషికేష్ను పోగొట్టుకున్న శ్రీనివాసరావుకు ఆ తర్వాత కూతురు పుట్టింది. ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుతోంది. కూతుర్ని ప్రాణప్రదంగా పెంచుకుంటూ కొడుకు పోయిన దుఃఖాన్ని మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నారు. ఇంతలోనే విధి మళ్లీ వికటించి, ఆయన కుటుంబాన్ని కాటేసింది. రోడ్డు ప్రమాదంలో శ్రీనివాసరావును కూడా తీసుకెళ్లింది. ఇప్పుడా ఇంట్లో మిగిలింది అతని అమ్మ, భార్య, కుమార్తె. మూడు తరాల మగవాళ్లను కోల్పోయిన ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి మాటలు చాలడం లేదు.
అటు, కీసర టోల్ప్లాజా కేసు దర్యాప్తులో కీలక విషయాలు బైటికొస్తున్నాయి. కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. యాష్ ట్యాంకర్ను అక్కడి నుంచి తొలగించడానికి పదిగంటలకు పైగా సమయం పట్టింది. అటు, డ్రైవర్ లేన్ దాటి, డివైడర్ని ఎక్కినట్టు స్పష్టమైన ఆధారాలున్నాయి. అతివేగం, ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాధమికంగా తేల్చారు పోలీసులు.
ట్యాంకర్ పడిపోయిన వెంటనే అక్కడి నుంచి పరారైనప్పటికీ, తర్వాత పోలీసులకు లొంగిపోయాడు ట్యాంకర్ డ్రైవర్. కానీ, ప్రమాదసమయంలో అతడు మద్యం తీసుకోలేదని తేలింది. ట్యాంకర్ ఫిట్నెస్పై ఆర్టీఏ రిపోర్టు రావాల్సి ఉంది.
నేషనల్ హైవే అధారిటీ ప్రకారం జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదు. అందుకే, కీసర టోల్ ప్లాజా దగ్గర స్పీడ్ బ్రేకర్లు తీసేశారు. కానీ, వెహికల్స్ ఆగి ఆగి ప్రయాణిస్తాయి కనుక, ఇక్కడ కూడా స్పీడ్బ్రేకర్లు పెడితే బెటర్ అంటున్నారు పోలీసులు. అటు, టోల్ ప్లాజా నిర్వహణలో ఏదైనా తప్పిదం జరిగిందా అని కూడా ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద టోల్ గేట్ల దగ్గర కూడా అప్రమత్తంగా ఉండకపోతే డేంజర్ తప్పదనడానికి లైవ్ ఎగ్జాంపుల్ BMW ట్రాజెడీ, అడ్వొకేట్ శ్రీనివాసరావు కుటుంబంలో కొండంత దుఃఖం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..