
ఏపీలోని విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలకమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కోసం అర్హత పొందిన తల్లులు తమ దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో సులభంగా పరిశీలించుకునే అవకాశం కల్పించింది. ఆధార్ నంబర్ ఆ సహాయంతోనే వివరాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పథకానికి సంబంధించిన అర్హుల గుర్తింపు, వివరాల పరిశీలన, ధృవీకరణ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలల ద్వారా విద్యార్థుల వివరాలను సేకరించి తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం ఒకే కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నా, అర్హత ప్రమాణాలు నెరవేర్చిన ప్రతి విద్యార్థికి పథకం వర్తిస్తుంది. దీంతో గత పథకాలతో పోలిస్తే ఎక్కువ కుటుంబాలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
ఆన్లైన్లో చూపిస్తున్న సమాచారంలో ఏవైనా పొరపాట్లు కనిపిస్తే వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇందుకోసం సమీప గ్రామ లేదా వార్డు సచివాలయంలోని సంబంధిత అధికారిని లేదా పిల్లలు చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
అవసరమైతే ఈ కేవైసీ ప్రక్రియను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. పథకం కింద మంజూరయ్యే ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నందున ఆధార్ బ్యాంక్ లింకింగ్ పూర్తి చేసి ఉండాలి. అలాగే NPCI మ్యాపింగ్ సక్రియంగా ఉండటం కూడా అవసరం. ఈ ప్రక్రియలు పూర్తయితే నిధుల జమలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని అధికారులు చెబుతున్నారు. పథకం అమలులో విద్యార్థుల పాఠశాల హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించడం, తల్లులపై విద్యా ఖర్చుల భారం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నాయి.