
Statue of PM Narendra Modi: ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సూర్య శిల్పశాలలో 14 అడుగుల ఎత్తు, రెండు టన్నుల ఆటోమొబైల్ ఐరన్ స్క్రాప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరావు, ఆయన కుమారుడు రవిచంద్రలు ప్రధాని మోదీ విగ్రహాన్ని తయారు చేశారు. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్లు వెల్లడించారు. తీసిపారేసిన ఐరన్ స్క్రాప్తో ప్రధాని మోడీ పోలికలతో విగ్రహాన్ని తయారు చేయడం చాలా కష్టమని కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇంత పెద్ద విగ్రహం తయారు చేయడం చాలా సాహసంతో కూడుకున్న పని అని.. ఇప్పటివరకు భారతదేశంలో శిల్పులెవరూ స్క్రాప్తో విగ్రహాన్ని తయారు చేయలేదని వెల్లడించారు.
మూడు నెలలపాటు పదిమంది పని సిబ్బందితో కష్టపడి చేసినట్లు కాటూరి వెంకటేశ్వరావు కుమారుడు రవిచంద్ర వివరించారు. ఈనెల 16వ తేదీన ఈ విగ్రహాన్ని బెంగళూరు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న తెనాలి శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ శిల్పశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ.. తెనాలికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రను ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి కళాకారులు తెనాలిలో ఉన్నందుకు తెనాలి శాసనసభ్యునిగా తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. ఇంకా మరెన్నో విగ్రహాలకు రూపకల్పన చేయాలని శిల్పులను కోరారు.
వీడియో..
Nagaraju, TV9 Telugu Reporter, Guntur Dist
Also Read: