
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేవారికి సూపర్ న్యూస్. కొత్త నేషనల్ హైవే 565 అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ మీదుగా తిరుపతి వెళ్లేవారికి ఈ కొత్త హైవే ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే 65ని మదనపల్లె-నాయుడుపేట హైవే 71తో ఇది కలపనుంది. తెలంగాణలోని నకిరేకల్ నుంచి తిరుపతి సమీపంలోని ఏర్పడే వరకు ఈ కొత్త జాతీయ రహదారి 565 ఉంటుంది. నల్లగొండ, మాచర్ల, యర్రగొండపాలెం మీదుగా మార్కాపురం, పొదిలి, కనిగిరి పామురు వెళుతుంది. ఇక దుత్తలూరు, రావూరు, వెంకటగిరి, ఏర్పాడు మీదుగా తిరుపతికి వెళుతుంది.
ఇక ఈ కొత్త జాతీయ రహదారి వల్ల యర్రగొండపాలెం నుంచి హైదరాబాద్కు వెళ్లేవారికి కూడా ప్రయాణం సమయం తగ్గనుంది. అత్యంత వేగంగా హైదరాబాద్కు చేరుకోవచ్చు. ఎలాంటి ట్రాఫిక్ రద్దీని లేని ప్రయాణం లభించనుంది. ఈ కొత్త హైవే మొత్తం 420 కిలోమీటర్లు ఉంటుంది. తెలంగాణ, ఏపీని కలిపే ఈ హైవే.. ఎక్కువ భాగంగా ఏపీలో ఉంటుంది. నల్లగొండ, దేవరకొండ తర్వాత మాచర్ల వద్ద ఈ హైవే ఏపీలో కలుస్తుంది. శ్రీకాళహస్తి, తిరుపతి వెళ్లాలనుకునేవారికి ఇది ఎంతో ఉపయోగపడనుందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం మరింత సులువు అవ్వడంతో పాటు తిరుపతి వెళ్లేవారికి సహాయపడనుంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలి యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా అందుబాటులోకి రానుంది. ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు ఇది ఉంటుంది. సుమారు 162.04 కిలోమీటర్ల ఈ హైవే అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ నుంచి విశాఖకు 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం విజయవాడ మీదుగా విశాఖకు వెళ్లాలంటే ఎక్కువ సమయం పడతుంది. ఈ హైవే వల్ల ప్రయాణ సమయం తగ్గనుంది. ఈ హైవేకు ఎన్హెచ్ 365బీజీగా నామకరణం చేశారు. మే నెలలో ఈ హైవే ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ హైవేలో అనేక అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ ఛార్జి వసూలు చేసేలా సాంకేతికత ఉపయోగిస్తారు. ఇక సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెళ్లు, ఎమర్జెన్సీ మీడియా ఓపెనింగ్స్ వంటివి ఉంటాయి.