ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. వారికి అధికార లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారాలు..!

| Edited By: Balaraju Goud

Aug 08, 2024 | 7:55 PM

నిజంగా మరణించి బతుకుతున్న వారికి సలాం చేయాలి.. అలాగే పుట్టడు దుఃఖంలోనూ నలుగురి జీవితాల్లో వెలుగులో నింపేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన ఆ కుటుంబాలకు సెల్యూట్ చేయాల్సిందే..! ఈ నేపథ్యంలోనే వారికి అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. వారికి అధికార లాంఛ‌నాల‌తో అంతిమ సంస్కారాలు..!
Organ Donation
Follow us on

నిజంగా మరణించి బతుకుతున్న వారికి సలాం చేయాలి.. అలాగే పుట్టడు దుఃఖంలోనూ నలుగురి జీవితాల్లో వెలుగులో నింపేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన ఆ కుటుంబాలకు సెల్యూట్ చేయాల్సిందే..! ఈ నేపథ్యంలోనే వారికి అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

బ్రెయిన్ డెడ్‌తో మరణించి అవయవదానంతో పలువురికి జీవదాతలుగా నిలిచిన వారి పార్థివదేహాల‌కు గౌరవప్రదమైన వీడ్కోలు తెల‌పాల‌ని ఏపీ సర్కార్ నిర్ణయించింది. వారి కుటుంబాల‌కు రూ.10,000 పారితోషికాన్ని అందజేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ వైద్యఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి .కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. అవ‌య‌వ దాత‌ల భౌతికకాయాల అంతిమ సంస్కారాన్ని గౌర‌వప్రదంగా నిర్వహించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే వారి కుటుంబ స‌భ్యుల‌కు రూ.10 వేలు పారితోషికాన్ని అంద‌జేసేలా సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఉత్తర్వులు వెలువ‌డేలా చ‌ర్యలు తీసుకుంటాన‌ని కృష్ణబాబు తెలిపారు

అవయవ దాతలకు అండగా ఉంటామని, ప్రపంచ అవ‌య‌వ దాన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ఆయా జిల్లాల్లో జిల్లా క‌లెక్టర్ లేదా ఎస్పీ అంత్యక్రియ‌ల‌కు హాజర‌య్యేలా ఆదేశాలిస్తామ‌ని మంత్రి ప్రక‌టించారు. మంత్రి చొర‌వ‌తో గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అవయవ దానంతో పలువురికి జీవన దానం చేసిన జీవదాతల భౌతికకాయాల‌కు గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక్కొక్కరికీ రు.10 వేల వంతున పారితోషికాన్ని మంజూరు చేస్తోంది.

అవయవ దాతల కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ వారిని శాలువా, ప్రశంసాపత్రం, పుష్పగుచ్ఛాలతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. వీటిని అనుసరించాలని అధికారులకు కూడా సూచించింది. బ్రెయిన్ డెడ్ వ్యక్తి భౌతిక శరీరం నుండి అవయవాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లేదా సంబంధిత (ప్రైవేటు) ఆస్పత్రి ప్రధానాధికారి ద్వారా సేకరించిన తరువాత సంబంధిత జిల్లా కలెక్టర్ వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేస్తారు. అవయవ సేకరణ అనంతరం భౌతికకాయాన్ని తగిన సమయంలో సగౌరవంగా దాత భౌతిక దేహానికి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సంబంధిత జిల్లా కలెక్టర్ హాజరు అవుతారు. ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలతో హాజరు కాలేకపోతే జిల్లా స్థాయి సీనియర్ అధికారి హాజరు అవుతారు.

అంతిమ సంస్కార కార్యక్రమానికి హాజరైన అధికారి మరణించిన జీవదాత భౌతిక దేహంపై పుష్పగుచ్ఛాన్ని వుంచి గౌరవిస్తారు. మరణించిన దాత కుటుంబ సభ్యులకు గౌరవ చిహ్నంగా శాలువా, ప్రశంసాపత్రం, ఒక పుష్పగుచ్ఛాన్ని అందచేసి ప్రభుత్వం తరపున వారిని గౌరవిస్తారు. ఇందుకు దాత ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల వ్యయానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. దీంతో పాటు అంతిమ సంస్కార వ్యయం కింద రు.10వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. అంతేకాక దాతల కుటుంబ సభ్యులకు ప్రశంసాపత్రంతోపాటు జ్ఞాపికను కూడా అందజేస్తారు. అవయవ సేకరణ అనంతరం ఆస్పత్రి నుండి దాత నివాసం లేదా స్మశాన వాటికకు భౌతికకాయాన్ని ఉచితంగా తరలించే ఏర్పాట్లు చేస్తారు. జీవదాత భౌతిక దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించటానికి ముందు రాష్ట్రప్రభుత్వం తరపున కార్యక్రమానికి హాజరైన ఉన్నతాధికారి, స్థానిక ప్రజా ప్రతినిధుల వంటి వారు గౌరవ వందనంతో అంతిమ వీడ్కోలు పలుకుతారు. అనంతరం దాతకు సంబంధించిన ఫొటోతో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో జిల్లా కలెక్టర్ పత్రికా ప్రకటన జారీ చేస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..