
కానూరులోని ఓ కళాశాలలో నీట్ శిక్షణ పొందుతున్న హైదరాబాద్కు చెందిన ఓ విద్యార్థిని కళాశాల వసతిగృహంలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు హైదరాబాద్లోని బేగంపేటకు చెందిన కంతేటి వైష్ణవి (19)గా గుర్తించారు. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సిద్ధమవుతూ, కృష్ణా జిల్లాలోని కానూరులో ఉన్న శ్రీ భారతి ఇన్స్టిట్యూట్ లాంగ్టర్మ్ కోచింగ్ సెంటర్లో మూడు వారాల క్రితం చేరింది. కళాశాల హాస్టల్లోనే ఉంటూ కోచింగ్ తీసుకుంటోంది.
ఇటీవల రెండు రోజుల పాటు ఇంటికి వెళ్లి తిరిగి హాస్టల్కు వచ్చిన వైష్ణవి.. కుటుంబానికి దూరంగా ఉండటం తన వల్ల కావడం లేదని, ఇంత దూరంలో ఉండి చదవడం కష్టంగా ఉందని పలుమార్లు తల్లిదండ్రులకు ఫోన్లో తన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఆమె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ధైర్యం చెబుతూ చదువుపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 4వ తేదీన ఆరోగ్యం బాగోలేదని చెప్పి వైష్ణవి తరగతులకు హాజరుకాకుండా హాస్టల్ గదిలోనే ఉండిపోయింది. రాత్రి సమయంలో గదిలో ఉన్న ఇతర విద్యార్థినులు తిరిగి వచ్చి తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో కళాశాల సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది కిటికీ నుంచి పరిశీలించగా వైష్ణవి ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది.
వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థిని మృతి వార్త అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన కానూరుకు చేరుకున్నారు. చదువు కోసం పంపించిన కుమార్తె విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వైష్ణవి మృతికి గల కారణాలు ఏమిటనే అంశంపై విచారణ కొనసాగుతోంది.
మరిన్ని క్రైం వార్తల కోసం క్లిక్ చేయండి..