ఏపీలో ఉద్యోగాల జాతర.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఆ సంస్థ..

|

Aug 19, 2024 | 7:42 PM

ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ఏపీలో ఉద్యోగాల జాతర.. పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఆ సంస్థ..
Nara Lokesh
Follow us on

అమరావతి, ఆగస్టు 19: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ఐటీ శాఖ మంత్రి లోకేష్, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఫాక్స్ కాన్ బృందానికి మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. కంపెనీ ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు. 2014 నుండి 2019 వరకూ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్, ఈవీ పాలసీల గురించి వివరించారు. కియా కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన విధానాన్ని ఒక కేస్ స్టడీగా చెప్పారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు.

ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి..

సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుండి 2019 వరకూ అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయన్నారు. అందులో ఫాక్స్ కాన్ కూడా ఒకటని పేర్కొన్నారు. 14 వేల మంది మహిళలకు నాడు ఈ కంపెనీ ద్వారా ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఇప్పుడు ఫాక్స్ కాన్ ఇండియా తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా కేవలం ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం కాకుండా.. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం ఇక్కడ నిర్మించాలని ఆ కంపెనీ ప్రతినిధులను మంత్రి నారా లోకేష్ కోరారు. ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామన్నారు. తమ ప్రభుత్వంలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆ లక్ష్య సాధనలో ఫాక్స్ కాన్ ప్రదాన భూమిక పోషించాలని కోరారు. అనుమతుల నుండి ఉత్పత్తి వరకూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని సంస్థ ప్రతినిధులకు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎలాంటి సహకారం కావాలన్నా తానే స్వయంగా దగ్గరుండి చూసుకుంటానని వారికి భరోసా కల్పించారు.

ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ..

పెట్టుబడుల ఆకర్షణలో సీఎం చంద్రబాబు చూపించే చొరవను ఫాక్స్ కాన్ కంపెనీ ఇండియన్ రిప్రజెంటేటివ్ వి.లీ కొనియాడారు. ఏపీతో తమకు మంచి అనుబంధం ఉందని.. కానీ గత ఐదేళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకు అనేక ప్లాంట్లు ఉన్నాయని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. భారతదేశంలో పెద్దఎత్తున కార్యకలాపాలు విస్తరించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలోనే తమ బృందం ఏపీ అధికారులతో చర్చిస్తారని తెలిపారు. ఉద్యోగాల కల్పనకు తమవంతూ కృషిచేస్తామని ఈ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..