AP 10th Results: టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల.. రీవెరిఫికేషన్ తేదీలు ఇవిగో.. ఫీజు ఎంత కట్టాలంటే.?

రాష్ట్రవ్యాప్తంగా 85.25 శాతం మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ముఖ్యంగా ఉత్తీర్ణత సాధించిన 5,26,954 మందిలో 83.69 శాతం మంది ఫస్ట్ డివిజన్ సాధించడం గమనార్హం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు సాధించిన ఈ విజయం అభినందనీయం.

AP 10th Results: టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల.. రీవెరిఫికేషన్ తేదీలు ఇవిగో.. ఫీజు ఎంత కట్టాలంటే.?
Students

Updated on: Apr 30, 2026 | 12:01 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మార్చి 16 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 6,18,131 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు.

ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25 శాతంగా నమోదైంది. గతంతో పోలిస్తే ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. బాలికలు 87.90 శాతం ఉత్తీర్ణతతో అబ్బాయిల(82.68 శాతం) కంటే 5.22 శాతం ముందంజలో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే, పార్వతీపురం మన్యం జిల్లా 96.07 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 57.12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 2,161 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే టీవీ9 సైట్ ద్వారా చూడవచ్చు. అదనంగా, వాట్సాప్(95523 00009) ద్వారా ‘Hi’ అని పంపి ఫలితాలు పొందవచ్చు. ‘LEAP’ మొబైల్ యాప్, డిజిలాకర్ ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అనుకున్న మార్కులు రాని వారు నిరాశ చెందకుండా, మే 1 నుంచి మే 7 వరకు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 25 నుంచి జూన్ 4 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం మార్క్స్ మెమోలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. రీకౌంటింగ్(సబ్జెక్ట్‌కు రూ. 500), రీవెరిఫికేషన్(సబ్జెక్ట్‌కు రూ. 1000) ఫీజు కట్టాల్సి ఉంది.

Follow Us