AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్

ఏపీ మద్యం కేసులో రిమాండ్‌లు..అరెస్ట్‌లు.. అటాచ్‌మెంట్‌లతో జోరుమీదున్నాయి సిట్, ఈడీ సంస్థలు.. ఇప్పటికే కేసు దర్యాప్తులో వేగం పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌..లేటెస్ట్‌గా నిందితుల ఆస్తులను అటాచ్ చేసింది. ఈ సందర్భంగా కీలక అంశాలను ప్రస్తావించారు ఈడీ అధికారులు.. లిక్కర్ కేసులో రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ.. షెల్ కంపెనీలతో రూ.1048 కోట్లు కొల్లగొట్టారని పేర్కొంది.

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
Ap Liquor Scam Case

Updated on: Mar 07, 2026 | 9:00 AM

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు మీదుంది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. లేటెస్ట్‌గా ఈ కేసులో పలువురి నిందితుల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యలకు సంబంధించిన 441 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఈ మొత్తంలో స్థిర, చరాస్తులు ఉన్నాయి. నిందితులు షెల్ కంపెనీల ద్వారా రూ.1048 కోట్లు కొల్లగొట్టారంటూ ప్రకటనలో తెలిపింది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో భాగంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. Prevention of Money Laundering Act 2002 కింద ఈ ఆస్తులను అటాచ్‌ చేసింది. హైదరాబాద్ ఈడీ జోనల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకుంది.

ఏ2 వాసుదేవరెడ్డిని రెండో రోజు విచారించిన సిట్

లిక్కర్ కేసులో ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కూడా కస్టడీకి తీసుకుని విచారించారు. విచారణలో వాసుదేవరెడ్డిపై వందకి పైగా ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. మద్యం ముడుపుల్లో అంతిమ లబ్ది ఎవరు అనే అంశంపై సిట్ ఆరా తీసింది. కీలక సమాచారం సేకరించిన అనంతరం వాసుదేవరెడ్డిని తిరిగి గుంటూరు జైలుకు తరలించారు.

మద్యం కుంభకోణంతో ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల నష్టం

మద్యం కుంభకోణం ద్వారా ప్రభుత్వానికి 4 వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019 తర్వాత లిక్కర్‌ పాలసీలో మార్పులు చేసినట్లు ఈడీ గుర్తించింది. పాత మద్యం బ్రాండ్లను మార్కెట్‌ నుంచి తొలగించి, ఫేవర్‌ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో ఈడీ అధికారులు గుర్తించారు. ప్రతి కేసుపై 15 నుంచి 20 శాతం వరకు కిక్‌ బ్యాక్‌ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమిషన్‌ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేసినట్లు ఈడీ గుర్తించింది.

మరోవైపు లిక్కర్ కేసులో ఏ52గా ఉన్న ప్రణయ్‌ ప్రకాష్‌ను ఇటీవల నేపాల్‌లోని సోనౌలీ చెక్ పోస్ట్ దగ్గర అరెస్టు చేశారు సిట్‌ అధికారులు. ఉత్తరప్రదేశ్‌‌లోని మహారాజ్ గంజ్ కోర్టులో హాజరు పరిచిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌తో విజయవాడ తీసుకువచ్చారు. ఏసీబీ కోర్టు అనుమతితో మార్చి 13 వరకు జ్యూడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ప్రణయ్‌ ప్రకాష్‌ అరెస్ట్‌తో ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 17కు చేరింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us