‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకం డబ్బులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి విడుదల చేశారు. మంగళవారం ఉదయం.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా విడుదల చేసింది.
ఈ పథకం కింద అర్హత గల వారిని ఒక్కరిని కూడా వదలకుండా అందరి ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేసింది ప్రభుత్వం. ఇందులో మొత్తం 1,19,875 కుటుంబాలకు రూ.10వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. ఇక గడచిన రెండేళ్లలో మత్స్యకారులకు రూ.211.71 కోట్ల మేర లబ్ధి కలిగింది. ఈ ఏడాది మరో రూ.119.87 కోట్లతో కలిపి మూడేళ్లలో రూ.331.58 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది.
అయితే గతంలో రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భృతి మొత్తాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. రెండేళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వేట నిషేధ సమయంలోనే భృతిని అందజేస్తూ మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ విధంగా 2019లో 1,02,478 కుటుంబాలకు రూ.102.48 కోట్లు లబ్ధి చేకూర్చగా, 2020లో 1,09,231 కుటుంబాలకు రూ.109.23 కోట్ల మేర సాయమందించారు.