
ఏపీలో కొత్త పించన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. కొత్త పింఛన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వితంతు పింఛన్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు చేసుకున్నవారిలో కొత్తగా వితంతు పింఛన్ల కేటగిరీలో 2.20 లక్షల మంది అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రెండు నెలల్లో వీటికి పింఛన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. త్వరలోనే పించన్ల పంపిణీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కేటగిరీ కింద వితంతు మహిళలకు ప్రతీ నెలా రూ.4 వేల చొప్పున అందించనున్నారు. కొత్తగా పించన్ల కోసం అర్హులైనవారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి ఇది శుభవార్తగా చెప్పవచ్చు.
ప్రస్తుతం రాష్ట్రంలో 62.34 లక్షల మందికి పింఛన్లను అందజేస్తున్నామని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి రూ.33 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 లక్షల మంది పింఛన్లు తీసుకునేవారు మరణించారని, పింఛన్ తీసుకునే భర్త చనిపోతే భార్యకు వెంటనే స్పాజ్ కేటగిరీ కింద పింఛన్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పాజ్ కేటగిరీ కింద 2.45 లక్షల మందికి కొత్తగా పింఛన్లను అందించినట్లు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం పింఛన్లను తొలగించిందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 9.56 లక్షల పింఛన్లను తొలగించిందని, తమ ప్రభుత్వం 7856 పింఛన్లను అనర్హుల కేటగిరీలో తొలగించిందని చెప్పారు. దివ్యాంగులు, మిగిలి పించన్లలో ఏ ఒక్కరి పేరు కూడా తొలగించలేదని అన్నారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పించన్లను మంజూరు చేస్తున్నామన్నారు. ఎప్పుడైనా దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు.
ఇక డ్వాక్రా మహిళలు తయారుచేసే ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెటింగ్ లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం తొలి విడతలో 100 ఉత్పత్తులను ఎంపిక చేశామన్నారు. ఇక నిరుపేద వర్గాల కోసం మండల సమాఖ్యల ద్వారా తక్కువ వడ్డీకే రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. రూ.20 వేల వరకు వీరికి రుణం అందిస్తున్నట్లు చెప్పారు. ఇక ఎస్సీ, ఎస్టీలకు ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు కల్పి్స్తున్నామని తెలిపారు. ఇక డ్వాక్రా మహిళలు ఉపయోగిస్తున్న మన డబ్బులు-మన లెక్క యాప్ ద్వారా డ్వాక్రా రుణాల వాయిదాల చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలు జరగవని అన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 19 పార్కులో ఏర్పాటు పూర్తయిందని తెలిపాయి. ఇక రాష్ట్రంలో ఎంఎస్ఈలను ప్రోత్సహిస్తున్నామని, వీటికి రూ.1.91 కోట్ల రుణాలు మంజూరు చేశామని స్పష్టం చేశారు. ఇక త్వరలో ఈ పరిశ్రమలకు రూ.500 కోట్ల ప్రోత్సహకాలు అందించనున్నట్లు కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.